టీడీపీలో యువ శకం మొదలైందా? ఇక వచ్చే ఎన్నికల్లో అంతా యువతకే ప్రాధాన్యం ఇవ్వబోతున్నారా? సీనియర్లకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైందా? పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఈ ఉద్దేశంలోనే ఉన్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.ముఖ్యంగా మంత్రి వర్గ విస్తరణను నిశితంగా పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోందని చెబుతున్నాయి.2019 ఎన్నికల నాటికి చినబాబు లోకేశ్ టీమ్ తెరపైకి రావడం… అదే సమయంలో సీనియర్లకు చెక్ చెప్పడం ఇవన్నీ ఏకకాలంలో జరిగిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.చంద్రబాబు కూడా సీనియర్లను పక్కన పెట్టడం కూడా చర్చనీయాంశమైంది
తెలుగుదేశం పార్టీలో సీనియర్లకు అప్రకటిత రిటైర్మెంట్ ప్రకటించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో వారిని పూర్తిగా పక్కన పెట్టేందుకు పూర్వరంగాన్ని సిద్ధం చేసినట్లుగా తాజా కూర్పును బట్టి అర్ధమవుతోంది.శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న గౌతు శ్యామసుందర శివాజీ ఒక్క ఛాన్స్ అంటూ ఎంతగా ప్రాధేయపడినా పార్టీ నాయకత్వం పట్టించుకోలేదు.
దాంతో, ఇక 2019కి రాజకీయాల నుంచి రిటైర్ కావడం అనివార్యమవుతోంది.ఇక్కడ కళా వెంకటరావును పక్కన పెట్టుకుని రాజకీయాలు నెరిపారని మంత్రి లోకేష్ భావిస్తున్నారు.శ్రీకాకుళం జిల్లాలో 2019 నాటికి తమ అనుచర గణం పెరగాలన్న ఉద్దేశ్యంతో లోకేష్ మంత్రులను ఎంపిక చేసుకున్నారని చెబుతున్నారు.
ఇక విజయనగరం జిల్లాలో ఎంపీ పి.అశోక్గజపతిరాజు సైతం 2019 నాటికి పదవీ విరమణ చేయక తప్పని పరిస్థితి నెలకొని ఉంది.ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఆయనతో వైరం ఉన్న బొబ్బిలి రాజులకు పట్టం కట్టిన వైనం చూస్తే భవిష్యత్తులో బొబ్బిలి వంశస్థులే జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పగలరని స్పష్టమవుతోంది.
విశాఖ జిల్లాలో లోకేష్ కోటరీలో ఉన్న సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడుకు మంత్రి పదవి కట్టబెట్టినా గతంతో పోలిస్తే అంతగా ప్రాధాన్యత లేని శాఖను కట్టబెట్టారు.ఈసారి రాజకీయాల నుంచి పక్కకు తొలగాలని అయ్యన్న భావిస్తున్నారని టాక్.
ఆయన తనయుడు లోకేష్ గుడ్ లుక్స్లో ఉండడంతో అయ్యన్న సీనియారిటీ ఇకపై తెర వెనకకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి
ఇదే జిల్లాలో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావుకు కాపుల ఉద్యమం దృష్ట్యా ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తున్నా పార్టీ పట్ల ఆయన విధేయతపై ఇంకా సందేహాలు ఉన్నట్లుగానే అధినాయకత్వం భావిస్తోంది.గంటాను కొనసాగించినా ఆయనకు చెక్ పెట్టేందుకు అదే సామాజికవర్గానికి చెందిన కళాకు కీలకమైన శాఖను కూడా అప్పగించారని టాక్.
ఈ నేపథ్యంలో 2019కి టీడీపీలో దశాబ్దాల నాటి నుంచి ఉన్న సీనియర్లు ఎన్నికల గోదాలోనే కనిపించకపోవచ్చనేది స్పష్టమవుతోంది.