‘రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం కిందికి తీసుకురావచ్చంటారా? మీ అభిప్రాయం చెప్పండి’ ….అని సుప్రీం కోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి, కాంగ్రెసు, భాజపా సహా ఆరు రాజకీయ పార్టీలకు నోటీసులు జారీ చేసింది.
ఇప్పుడు ఈ నోటీసులు ఎందుకు జారీ చేసిందంటే….రాజకీయ పార్టీలను పబ్లిక్ అథారిటీలుగా పరిగణించి, వాటిని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్్స అనే ప్రభుత్వేతర సంస్థ (ఎన్జివో) సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.
దాన్ని విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం కేంద్రానికి, ఎన్నికల సంఘానికి, పార్టీలకు నోటీసులు జారీ చేసింది.రాజకీయ పార్టీలు పబ్లిక్ అథారిటీలని, కాబట్టి అవి వాటి ఆస్తుల, విరాళాల వివరాలు ప్రకటించాలని, అవి ఆర్టీఐ పరిధిలోకి వస్తాయని ఇదివరకే కేంద్ర సమాచార కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ నుంచి, ప్రభుత్వ సంస్థల నుంచి ఆర్టిఐని ఉపయోగించి సమాచారం సేకరిస్తున్నప్పుడు ప్రజలతో సంబంధం ఉండే పార్టీల నుంచి ఎందుకు సేకరించకూడదు? ప్రభుత్వాలను ఏర్పాటు చేసి పాలన సాగించేవి పార్టీలే కదా.కాబట్టి వాటి ఆదాయ వివరాలు, విరాళాల సమాచారం మొదలైనవి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది.