అన్నాడీఎంకేలో ముందునుంచి అందరూ అనుమానం వ్యక్తం చేసినట్టుగానే అంతా జరిగింది.తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత మృతిచెందాక ఆర్థికమంత్రి పన్నీర్సెల్వం అప్పటికప్పుడు ఆఘమేఘాల మీద సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
తర్వాత జరిగిన పరిణామాలు శశికళ నాటరాజన్ పార్టీ మీద ఆధిపత్యం సాధించడంతో పాటు ఆమె సీఎం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పస్టం చేశాయి.
ఇక ఈ విషయంలో అందరూ ఊహించినట్టుగానే జరిగింది.
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ ఎన్నికయ్యారు.గురువారం చెన్నైలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
శశికళ నాయకత్వంలో అన్నాడీఎంకేలో అందరూ పనిచేస్తారని, ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శి అన్న విషయాన్ని అన్నాడీఎంకే అధికారిక వెబ్సైట్ సైతం ప్రచురించింది.దీంతో శశికళ విషయంలో అందరికి క్లారిటీ వచ్చేసింది.
ఇక ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం పన్నీర్ సెల్వం మాట్లాడుతూ పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకున్నట్టు ప్రకటించారు.కొత్త యేడాది సందర్భంగా జనవరి 2న ఆమె పార్టీ పగ్గాలు చేపడతారని సమాచారం.
ఇక ఈ సమావేశంలో మొత్తం 14 తీర్మానాలు ఆమోదించారు.జయలలిత పుట్టినరోజును జాతీయ రైతుల దినోత్సవంగా ప్రకటించాలని, అమ్మకు భారతరత్న ఇవ్వడంతో పాటు మెగసెసె, నోబెల్ శాంతి పురస్కారాలకు ఆమె పేరు ప్రతిపాదించాలని తీర్మానించారు.
శశికళ ఇక్కడే వ్యూహాత్మకంగా చక్రం తిప్పి…పన్నీర్ సెల్వానికి చెక్ పెట్టేందుకు మార్గం సుగమం చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.శశికళ సీఎం అవ్వడానికి మద్దతు తెలిపేవారికంటే వ్యతిరేకించే వారి సంఖ్యే ఎక్కువుగా కనిపిస్తోంది.
దీనిపై ఎవ్వరూ బహిరంగంగా నోరు మెదపడం లేదు.ఇక తాజాగా ఆమె పార్టీ పగ్గాలు చేపట్టడంతో సీఎం పీఠాన్ని కూడా మరి కొద్ది రోజుల్లోనే అధిష్టించే సూచనలు కనిపిస్తున్నాయి.
అన్నాడీఎంకే ఆనవాయితీ ప్రకారం పార్టీ పగ్గాలు, సీఎం కుర్చీ ఒకరి చేతుల్లోనే ఉండాలి.ఈ లెక్కన శశికళ తాను సీఎం అయ్యేందుకు మార్గం లైన్ క్లీయర్ చేసుకున్నట్టే కనపడుతోంది.
ఇక అమ్మ ప్రాథినిత్యం వహించిన ఆర్కె నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో శశికళ గెలిచి అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమే.ఆ తర్వాత ఆమె ఎప్పుడైనా సీఎం పీఠం అధిష్టించేందుకు ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం పార్టీలో బలమైన నేత ఎవరూ లేని తరుణంలో శశికళ నేతృత్వంలోనే పార్టీ , ప్రభుత్వం ఉంటే పార్టీ ఏకతాటిపై ఉండగలదని శశికళ మద్దతుదారులు పేర్కొంటున్నారు.