మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రేయ్’ సినిమా వరుస వాయిదాల తర్వాత రెండు సంవత్సరాలకు విడుదలకు సిద్దం అయ్యింది.ఈనెల 27న ఈ సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి అంతా సిద్దం చేశాడు.
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టాడు.ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది.
తాజాగా సెన్సార్ ముందుకు వెళ్లిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు ఏకంగా 41 కట్స్ చెప్పింది.సినిమాలో పలు బూతు డైలాగ్స్ను మరియు ఎక్స్పోజింగ్ సన్నివేశాలకు ఈ కట్స్ విధించినట్లుగా తెలుస్తోంది.41 కట్స్ చెప్పిన తర్వాత కూడా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది.
సాయిధరమ్ తేజ్, సయామీ ఖేర్ జంటగా శ్రద్దాదాస్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా రెండు సంవత్సరాల ముందు విడుదల కావాల్సి ఉంది.
కాని నిర్మాత ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇన్నాళ్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది.ఈ సినిమా కథపై ఉన్న నమ్మకంతో కొత్త హీరో అని కూడా చూడకుండా దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి ఏకంగా 40 కోట్ల బడ్జెట్ను ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.
కథానుసారం ఈ సినిమాలోని ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరించారు.దాంతో బడ్జెట్ తడిసి మోపెడు అయ్యింది.ఇక చౌదరి ఈ సినిమాను లాస్ రేటుకే అమ్ముకున్నాడు.సినిమా సక్సెస్ అయితే తప్ప ఈయన పెట్టుబడి పూడేది కష్టం అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు ఈ సినిమా పెద్దలకు మాత్రమే అంటూ మరో షాక్ ఇచ్చింది.