స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు ఏం జరిగిందని అనుకుంటున్నారా? దేశానికి స్వతంత్రం రావడానికి ముందు రోజు ఏం జరిగిందో చరిత్ర పుస్తకాల్లో ఉంది.కాని ఈ ఇండిపెండెన్స్ డేకు ముందు జరిగేది నోటుకు ఓటుకు సంబంధించింది.
ఇంతకూ అసలు విషయం ఏమిటంటే….నోటుకు ఓటు కేసులో ప్రధాన నిందితుడైన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై విచారణ ఆగస్టు పద్నాలుగో తేదీకి వాయిదా పడింది.
అంటే స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజన్నమాట.వాయిదా ప్రకారం సోమవారం రేవంత్ రెడ్డి, మరో ఇద్దరు నిందితులైన సెబాస్టియన్, ఉదయసింహా ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు.
అయితే ఏసీబీఅభ్యర్థన మేరకు విచారణను కోర్టు వాయిదా వేసింది.ఛార్జిషీటులో మరింత సమాచారం పొందుపరాచాల్సి వుందని, కాబట్టి విచారణను వాయిదా వేయాలని ఏసీబీ అధికారులు కోరారు.
ఇదిలా ఉండగా, ఏసీబీ అధికారులు బలవంతంగా తన నుంచి వాంగ్మూలం తీసుకున్నారని ఉదయసింహా ఆరోపించారు.రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన కొడంగల్ నుంచి కదలకూడదని హైకోర్టు ఆంక్షలు విధించిందని రేవంత్ తరపు లాయర్లు తెలియచేయగా, ఆయన హాజరు కావాల్సిందేనని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.