‘బ్రూస్లీ’ చిత్రం ఫెయిల్ అవ్వడంతో తన తర్వాత సినిమాకు చరణ్ చాలా గ్యాప్ తీసుకున్నాడు.ఈ గ్యాప్లో ఈయన తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తని ఒరువన్’ రీమేక్కు ఓకే చెప్పాడు.
ఈ సినిమా షూటింగ్ చడీ చప్పుడు కాకుండా మొదలు కూడా అయ్యింది.హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ను కూడా పూర్తి చేసి సినీ వర్గాలకు చరణ్ అండ్ టీం షాక్ ఇచ్చారు.
దాదాపు పది రోజుల పాటు సాగిన మొదటి షెడ్యూల్లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
అల్లు అరవింద్ ఈ రీమేక్ను నిర్మిస్తున్నాడు.
‘కిక్ 2’తో డిజాస్టర్ను సొంతం చేసుకున్న సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.తమిళంలో సూపర్ హిట్ అవ్వడంతో ఉన్నది ఉన్నట్లుగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
తమిళంలో నటించిన అరవింద్ సామీ ఈ చిత్రంలో కూడా విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.భారీ అంచనాలున్న ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.
అందుకే ఈ సినిమా షెడ్యూల్స్ను పూర్తి చేసేందుకు దర్శకుడు చాలా స్పీడుమీదున్నాడు.జూన్ చివరి వరకే సినిమా షూటింగ్ను పూర్తి చేయాలనే పట్టుదలతో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు.
ఈ చిత్రంలో హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ను ఎంపిక చేశారు.వీరిద్దరు ఇప్పటికే ‘బ్రూస్లీ’ చిత్రంలో కలిసి నటించిన విషయం తెల్సిందే.