టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఏం చేసినా భారీగానే ఉంటుంది.కెరీర్ ఆరంభం నుండి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జక్కన్న ప్రస్తుతం ‘బాహుబలి’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.
ఆ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి, ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటుంది.రెండు పార్ట్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ 225 కోట్లు అని తాజాగా నిర్మాతలు ప్రకటించారు.
అయితే అంత బడ్జెట్ అవుతుందా అని అంతా కూడా నోరు వెళ్లబెట్టారు.అయితే తాజాగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా వినిపిస్తున్న సమాచారం ప్రకారం నిర్మాతలు చెప్పింది నిజమే అయ్యి ఉండవచ్చు అంటున్నారు.
రాజమౌళి సినిమాలు అంటే గ్రాఫిక్స్కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.గత చిత్రం ‘ఈగ’ను ఎక్కువగా గ్రాఫిక్స్తోనే చేసిన జక్కన్న ఈ సినిమాలో కూడా దాదాపు 80 శాతం మేరకు గ్రాఫిక్స్ను చూపించనున్నాడు.
ఇంత భారీ మొత్తం గ్రాఫిక్స్ వర్క్కు ఏకంగా 75 కోట్లు ఖర్చు చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా బడ్జెట్ కూడా 70 కోట్లను దాటింది లేదు.
అలాంటిది ఈ సినిమా గ్రాఫిక్స్కే ఏకంగా 75 కోట్లు ఖర్చు చేయడం రాజమౌళికే చెందింది.ఈ రెండు పార్ట్లలో కూడా గ్రాఫిక్స్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని అంటున్నారు.
పలు దేశాల్లో ప్రతి రోజు 600 మంది ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమా జులై 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మే 31న ఆడియోను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.