పవర్స్టార్ జనసేన 2019 ఎన్నికల్లో పోటీ చేయడంపై ప్రకటన వచ్చినా పార్టీ మాత్రం ఇంకా సంస్థాగతంగా బలోపేతం అయ్యే వర్క్ మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు.పవన్ కాటమరాయుడుతో ఈ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా తర్వాత అయినా పవన్ జనసేనను బలోపేతం చేసే అంశాలపై దృష్టి సారిస్తాడా ? లేదా ? తర్వాత కమిట్ అయిన సినిమాలు తీసుకుంటాడా ? అన్నది కూడా క్లారిటీ లేదు.
ఇదిలా ఉంటే పవన్ పార్టీ పూర్తిగా కార్యకలాపాలు స్టార్ట్ చేస్తే ఆ పార్టీలోకి వెళ్లేందుకు ఇతర పార్టీల నాయకులు చాలా ఆసక్తితో ఉన్నారన్న వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
టీడీపీ, వైసీపీ రెండు పార్టీలలోని నాయకుల్లో చాలా మందికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు వచ్చే ఛాన్సులు కనిపించడం లేదు.ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా వైసీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకున్న టీడీపీ అక్కడ వాళ్లకే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తే ఇప్పటి వరకు అక్కడ ఇన్చార్జ్లుగా ఉన్న వారు ప్రత్యామ్నాయం వెతుక్కోక తప్పదుగా.!
ఇదిలా ఉంటే పవన్ జనసేనలో చేరతారంటూ ఏపీలో అధికార టీడీపీకి చెందిన చాలా మంది ప్రముఖుల పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు జనసేనలో చేరతామంటూ పవన్ను కలిస్తే పవన్ మాత్రం వారికి షాక్ ఇచ్చినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
వారిద్దరు కూడా పవన్ సామాజిక వర్గానికే చెందిన వారు.వీరు గతంలో పవన్ అన్న చిరు స్థాపించిన ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న వారు కావడం విశేషం.
ఉత్తరాంధ్రలోని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట టీడీపీ ఇన్చార్జ్ బండారు సత్యనారాయణమూర్తి ఇద్దరు వేర్వేరుగా జనసేనలో చేరే అంశంపై ఓ సారి చర్చించేందుకు పవన్ను కలిసి తమ మనస్సులో మాట బయటపెట్టారట.అయితే పవన్ మాత్రం జనసేన యువత, కొత్తరక్తంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తుందని, మీరు మా పార్టీ నుంచి టిక్కెట్లు ఆశించడం చేయవద్దని పవన్ నేరుగా చెప్పేశారట.
అవంతి మంత్రి గంటా గ్యాంగ్లోని మనిషి.ఆయన గతంలో భీమిలి నుంచి ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా గెలిచారు.
బండారు కూడా అదే పార్టీ నుంచి కొత్తపేటలో ఎమ్మెల్యేగా గెలిచారు.వీరిద్దరు వచ్చే ఎన్నికల వేళ ముందుగానే జనసేన టిక్కెట్ ఖరారు చేసుకునే పనిలో పవన్ను కలిస్తే పవన్ షాక్ ఇచ్చినట్లయ్యిందని టాక్.