జల్లికట్టు నిరసనలను ఆదర్శంగా తీసుకోని ఆంధ్రప్రదేశ్ కోసం స్పెషల్ స్టేటస్ సాధించుకుందాం అని రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో మొదలైన చర్చలు, ఇప్పుడు ఎపితో పాటు జాతీయవ్యాప్తంగా చర్చలకి ప్రాణం పోశాయి.జగన్, పవన్ కళ్యాణ్ కూడా స్పెషల్ స్టేటస్ పోరాటానికి తమ మద్దతు తెలపడంతో ఈ నెల 26న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు ప్లాన్ చేసారు యువతీయువకులు.
వీరిలో స్పూర్తిని రగిలించేందుకు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.అయితే, ఆ ట్విట్టర్ పోస్టులు ఇప్పుడు పవన్ ని లేని వివాదంలోకి నెట్టేలా ఉన్నాయి.కొన్ని నిమిషాల క్రితం కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ .
“తిడితే భరించాం. విడగొట్టి గెంటేస్తే సహించాం, ఇచ్చినమాట నిలబెట్టుకోకపోతే తిరగాబడతాం !! అన్నది ఆంధ్ర యువత కేంద్రం కి తెలియజెప్పాలి” అంటూ జనసేన అధ్యక్షుడు చేసిన ఓ ట్వీట్ పెద్ద దుమారమే రేపుతోంది.
కొందరు తెలంగాణ ప్రజలు పవన్ ట్వీట్ పై విరుచుకుపడుతున్నారు.
విడగొట్టడం, గెంటేయడం అనే పదాలు ఎందుకు వాడాల్సి వచ్చింది .ఒకనాడు ఉన్న రాష్ట్రాన్ని తిరిగి సాధించుకోవడం విడగొట్టడమా … పవన్ కళ్యాణ్ ని, ఆంధ్ర ప్రజల్ని ఎవరు గెంటేసారు , ఎక్కడికి గెంటేసారు ? తెలుగు ప్రజలు రాష్ట్రాలతో సంబంధం లేకుండా సఖ్యతతో ఉంటే, హైదరాబాద్ ఏసీ రూముల్లో కూర్చున్న పవన్ కళ్యాణ్ ఇలా విషయాలు లోతుగా తెలియని యువతని రెచ్చేగొట్టే వ్యాఖ్యలు చేయడం మంచి పధ్ధతి కాదు అని వారు వాదిస్తున్నారు.