స్టార్ హీరోలందరూ తమకు కాసులు కురిపించే బ్రాండ్లకు అంబాసిడర్లుగా వ్యవహరిస్తుంటే.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం సరికొత్త ట్రెండ్కు తెర తీశాడు.
ప్రస్తుతం అనధికారికంగా ప్రతిపక్ష నాయకుడి పాత్రలో కనిపిస్తున్న పవన్.మరో సరికొత్త అవతారంలో కనిపించబోతున్నాడు.
చేనేతకు చేయూతనిచ్చేందుకు జనసేనాని ముందుకొచ్చాడు.కాటమరాయుడు .కాటన్రాయుడిగా మారబోతున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లోని చేనేత కుటుంబాల జీవన పరిస్థితులు మెరుగుపరచాలని పవన్ పూనుకున్నారు.
చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు పవర్ స్టార్ స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు.తెలంగాణ అఖిలపక్ష చేనేత ఐక్య వేదిక ప్రతినిధులు, ఏపీ కార్మిక సంఘం నాయకులు జనసేన కార్యాలయంలో పవన్ ను కలిశారు.
నేత కార్మికుల ఆకలిచావులను, తమ దీనస్థితిని ఆయన దృష్టికి తీసుకువచ్చారు.రెండున్నరేళ్లలో ఒక్క తెలంగాణాలోనే 45 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.వారి కష్టాలను విన్న పవన్ చలించిపోయారు.చేనేతకు తాను అండగా ఉంటానని, చేనేత వస్త్రాలకు అంబాసిడర్గా ఉంటానని వారికి పవన్ హామీ ఇచ్చారు.
నేత కళ మన జాతి సంపద అని, దీనిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పవన్ ఉద్వేగంగా అన్నారు.చేనేత కుటుంబాలను ఆదుకోవడానికి శక్తి మేర కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
నేత పనిగిట్టుబాటు కాక మరే ఇతర పని చేతకాక చేనేతకార్మికుడు తనువు చాలిస్తున్నాడని వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.వచ్చేనెలలో గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించనున్న చేనేత సత్యాగ్రహం పద్మశాలి గర్జన కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రతినిధులు కోరగా.
పవన్ అందుకు అంగీకరించారు.చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించేందుకు పవన్ ముందుకు రావడంపై నేతన్నలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.