పార్లమెంటు సమావేశాలు రేపటి నుంచి (గురువారం) ప్రారంభం అవుతున్నాయి.ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాయి.
పార్లమెంటులో ప్రతిపక్షాల ప్రధాన ఆయుధం మత అసహనం.దాన్ని ఆయుధంగా చేసుకొని ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున దాడి చేసే అవకాశం ఉంది.
పార్లమెంటు సమావేశాలకు ముందు అసహనం మీద బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ చేసిన కామెంట్లు పెద్ద సంచలనమే కలిగించాయి.దీంతో దేశం మళ్ళీ వేడెక్కింది.
ఈ వేడి చల్లారక ముందే పార్లమెంటు శీతా కాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి కాబట్టి దీని మీదనే రచ్చ రచ్చ అయ్యే అవకాశం ఉంది.ఇటీవలే జరిగిన బీహార్ ఎన్నికల్లోనూ అసహనమే ప్రధాన పాత్ర పోషించింది.
కాబట్టి ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున దాడికి సిద్ధంగా ఉన్నాయి.బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఓడిపోవడం ప్రభుత్వానికి పెద్ద దెబ్బ.
రాజ్య సభలో ఎన్డీఏకు బలం లేదు.అక్కడ ప్రతిపక్ష పార్తీలాడే పై చేయి.
అందువల్ల కీలకమైన బిల్లులు పాస్ కావడం కష్టం.గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) బిల్లును ఈ సమావేశాల్లో ఆమోదింప చేసుకోవాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.
కానీ రాజ్య సభలో బలం లేదు.ఈ పరిస్థితిలో ప్రతిపక్షాలను బతిమిలాడుకోవడం తప్ప మార్గం లేదు.
సమావేశాలు ప్రారంభం కాగానే అసహనం పైనే చర్చ జరపడానికి సిద్ధమైన అపోజిషన్ పార్టీలు కాంగ్రెస్, సీపీఎం, జేడీయూ, జనతా దళ (యు) మొదలైనవి స్పీకరుకు నోటీసులు ఇచ్చాయి.జీఎస్టీ బిల్లును అడ్డుకోవడానికి వ్యూహాలు రూపొందించాయి.
దాద్రిలో ముస్లీం హత్య, హర్యానాలో దళిత కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లల సజీవ దహనం ఘటనల మీద ప్రభుత్వం పై విరుచుకు పడతామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు.జీఎస్టీ బిల్లు పాస్ కాకపోతే అందుకు తమ తప్పు ఉండదని సీపీఎం నేత సీతారాం ఏచూరి చెప్పారు.
ఈ బిల్లుపై ప్రభుత్వం అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించాల్సి ఉన్నా ఆ పని చేయలేదన్నారు.అపరిమితంగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరల మీద కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు.
మొత్తం మీద చూస్తే ఈ పార్లమెంటు సమావేశాలు కూడా సజావుగా జరిగేలా కనబడటం లేదు.