ఇల్లు ఎంత సౌకర్యంగా ఉంటుందో, ఇంట్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో…అలాంటి బస్సులు తెప్పించుకున్నారు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు.వీటిని తమ అవసరాలకు అనుగుణంగా తయారు చేయించుకుని ఉండొచ్చు.
ఇల్లు వంటి బస్సు కాబట్టి చాలా భారీగా, పొడుగ్గా ఉంది.ఇక లోపల ఇంద్రభవనం మాదిరిగా ఉంటుందనడంలో సందేహం లేదు.
శ్రీకృష్ణుడు ‘గీత’లో ఆత్మ గురించి చెబుతూ అది నీటిలో నానదని, అగ్నిలో కాలదని అంటాడు.ఈ బస్సు కూడా ఇటువంటిదేనట.
బుల్లెట్లు కురిపించినా ఏమీ కాదట.ఈ బస్సులో ఇంట్లో ఉండే సౌకర్యాలే కాకుండా, సీఎంల ఆఫీసుల్లో ఏ సౌకర్యాలు ఉంటాయో అన్నీ ఉంటాయి.
అంటే బస్సులో పర్యటనలు చేసినప్పుడు బస్సు నుంచే పరిపాలన చేస్తారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు హెలిక్యాప్టర్లో తిరగడమంటే బలే సరదా.
పక్కనున్న యాదగిరి గుట్టకు కూడా హెలిక్యాప్టర్లోనే వెళతాడు.అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేకసార్లు హెలిక్యాప్టర్లో పర్యటించారు.
మరి ఇప్పుడు ఇంత ఆధునికమైన బస్సు సర్వ హంగులతో వచ్చింది కాబట్టి హెలిక్యాప్టర్ ఎక్కరా? లేకపోతే దేని ఖాతా దానిదేనా? పాలకుల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కదా…! అయితే కేసీఆర్ మాత్రం ఎక్కువ రోజులు బస్సులోనే ప్రయాణించాలని నిర్ణయించుకున్నారట…! ఆఫీసు కన్నా బస్సు పదిలం అనుకుంటున్నారా? అవును మరి…దీన్ని ఎవరూ ఏమీ చేయలేరు కదా…!