వై కా పా అధినేత వై ఎస్ జగన్లో ఆత్మవిశ్వాసం రోజురోజుకు పెరిగిపోతున్నది.ఒక్క మాటలో చెప్పాలంటే అది విశ్వరూపం దాలుస్తున్నది.ఆ విశ్వరూపం పేరు ముఖ్యమంత్రి పదవి.2019 ఎన్నికల్లో వై కా పా గెలిచి తీరుతుందని, తాను ముఖ్యమంత్రిని అయి తీరుతానని పడే పడే బల్ల గుద్ది చెబుతున్నారు.గత మూడు రోజులుగా ఆయన ఇదే మాట అంటున్నారు.ఏపీ రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతుల నుంచి భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించి భూములు సేకరించాలని బాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జగన్ తీవ్రంగా విమర్శించారు.
రైతులకు మద్దతుగా బుధవారం విజయవాడలో జగన్ ధర్నా చేసారు.చంద్ర బాబు నాయుడు సంపన్నుల కోసమే రాజధాని నిర్మాణం చేస్తున్నారని అన్నారు.ఈ సందర్భంగానే తన ముఖ్యమంత్రి కోరికను మరోసారి వెల్లడించారు.తను ముఖ్యమంత్రి కాగానే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న భూములను తిరిగి రైతులకు అప్పగిస్తానని చెప్పారు.
తాను ముఖ్యమంత్రి కావడమే దేవుడి కోరిక అయితే ఆ పని కాకుండా ఎవ్వరూ ఆపలేరని చెప్పారు.ఏ రాజకీయ నాయకుదికైనా ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉంటుంది.
జగన్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కుమారుడు.ఆర్ధికంగా, రాజకీయంగా బలమైన కుటుంబం.
అలాంటి కుటుంబానికి చెందిన జగన్కు ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉండదా? తండ్రి చనిపోగానే ఆ పదవి కోసం చాలా తీవ్రంగా ప్రయత్నించిన జగన్ ఎలా విఫలం అయ్యాడో అందరికి తెలుసు.కాని ఇప్పుడు ఏపీలో జగన్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు.
వచ్చే నాలుగేళ్ళలో బాబు పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, దాంతో వై కా పా వైపు చూస్తారని అంచనా వేస్తున్నారు.వచ్చే నాలుగేళ్ళలో బాబు ప్రజా వ్యతిరేక పనులు చేస్తే జగన్కు అవకాసం ఉండొచ్చు.
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుతుందో చెప్పలేము.