రాజకీయాలన్నాక ఎప్పుడు ఏం జరుగుతుందో ? ఎవ్వరూ ఊహించలేరు.విపక్ష పార్టీలను, విపక్ష పార్టీ ప్రజాప్రతినిధులను టార్గెట్ చేయడమే కాదు, ఇక్కడ స్వపక్ష పార్టీ వాళ్లు, వాళ్లకు వాళ్లే టార్గెట్ చేసుకుంటూ, ఎర్త్లు పెట్టుకుంటూ ఉంటారు.
ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత ఇప్పుడు తన సొంత పార్టీలోనే ఓ ఎమ్మెల్యే సీటుకు ఎర్త్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్త నిజామాబాద్ జిల్లాలో జోరుగా వినిపిస్తోంది.
నిజామాబాద్లోని బాల్కొండ నియోజకవర్గం తెలంగాణ ఉద్యమానికి ఊతాన్నిచ్చిన నియోజకవర్గం.
ఇక్కడి నుంచి కేసీఆర్ ఆశీస్సులతో ప్రశాంత్ రెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మూడేళ్లు అవుతోంది.
నియోజకవర్గంలో ఆయనపై ఉన్న అంచనాలు అయితే అందుకోలేదు.ఇదిలా ఉండగానే ఇప్పుడు ఆయనకు మరో వ్యక్తి నుంచి ఇంటర్నల్గా ఎర్త్ స్టార్ట్ అయ్యింది.
ఈ ఎర్త్కు నిజామాబాద్ ఎంపీ కవిత కూడా తెరవెనక సాయం చేస్తున్నారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.
వచ్చే ఎన్నికల్లో బాల్కొండలో ప్రశాంత్రెడ్డికి కాకుండా సునీల్రెడ్డికి టిక్కెట్ ఇప్పించేందుకు కవిత గట్టి ప్రయత్నాలు చేస్తుండడంతో ప్రశాంత్కు కంటిమీద కునుకు ఉండడం లేదు.
ఇక సునీల్రెడ్డి ఆరెంజ్ ట్రావెల్స్ పేరుతో భారీ ఎత్తున బస్సులను నడుపుతున్నాడు.బీజేపీలో చాలా యాక్టివ్గా ఉన్న ఆయన కవిత పిలుపుతో టీఆర్ఎస్లోకి వచ్చినట్టు సమాచారం.
కవిత ఆశీస్సులు ఉండడంతో ఆయన బాల్కొండ నియోజకవర్గంలో దూసుకుపోతున్నాడు.
అంతే కాదు తన నియోజకవర్గ ప్రజలకు ఓ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు.
తన నియోజకవర్గంలో ఎవరి ఇంట్లో ఫంక్షన్లకు బస్సు కావాలన్నా ఫ్రీ గా ఇస్తున్నాడు.కేవలం డీజిల్, డ్రైవర్ ఖర్చు భరిస్తే చాలని అంటున్నారు.
దీంతో ప్రజలు సునీల్ను ఇట్టే తమలో కలిపేసుకున్నారు.సునీల్కు కవిత ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో ప్రశాంత్ ఆమెపై లోలోన తీవ్రంగా రగిలిపోతున్నాడట.
ఇక వచ్చే ఎన్నికల్లో కవిత జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందని అంటున్నారు.ఆమె జగిత్యాలకు వెళితే సునీల్రెడ్డి నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తారు.
ఒకవేళ ఆమె నిజామాబాద్ నుంచి పోటీ చేస్తే బాల్కొండ సీటు సునీల్రెడ్డిదే అంటున్నారు.అదే జరిగితే ప్రశాంత్రెడ్డికి షాక్ తప్పదు.