రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన వాటిలో అత్యంత కీలకమైనవి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్.ఈ రెండు విషయాల్లోనూ కేంద్రం అనుకూలంగా ఉంటుందని, ఇస్తుందని, ఇవ్వాలని అందరూ భావించారు.
అయితే, అనూహ్యంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదాను 14వ ఆర్థిక సంఘం బూచీ చూపించి ఎగవేసింది.దాని స్థానంలో అద్భుతం, పరమాద్భుతం అంటూ పెద్ద ఎత్తున ప్యాకేజీ ప్రకటించింది.
ఈ ప్రకటనకు ముందు కూడా అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.హోదా కన్నా ప్యాకేజీ మిన్న అనే లీకులు ఇచ్చారు కేంద్రంలోని నేతలు.
ఇక, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హోదా విషయంలో పెద్ద ఎత్తున అలజడి రేగింది.
ఈ క్రమంలో గట్టిగా పట్టుబట్టి కేంద్రం నుంచి ప్రత్యేక హోదాను రాబట్టాల్సిన సీఎం చంద్రబాబు ఈ విషయంలో లూజయ్యారు.
కేంద్రం ఇచ్చింది తీసుకుందాం.రావాల్సింది పట్టుబడదాం నినాదంతో ఆయన రాజీ ధోరణిని ప్రదర్శించారు.
దీంతో ప్రత్యేక హోదా అంశం అటకెక్కి.దాని స్థానంలో ఎలాంటి చట్టబద్ధతా లేని ప్యాకేజీ వచ్చి చేరింది.
దీనిపై విపక్షాలు ఒకింత రాద్ధాంతం చేసినా.ప్రస్తుతం మాత్రం ప్యాకేజీనే పరమాన్నంగా మారింది.
ఇక, ఇప్పుడు అందరి దృష్టీ.రైల్వే జోన్పై పడింది.
చంద్రబాబు కనీసం దీన్నయినా సాధిస్తాడా? లేక ప్రత్యేక హోదాను జారవిడుచుకున్నట్టు జోన్ని కూడా వదులుకుంటాడా? అనే సందేహాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతున్నాయి.
అయితే, జోన్ విషయంలో ఇటీవల రోజుల్లో జరుగుతున్న పరిణామాలు ఒకింత ఉత్సాహాన్నిస్తున్నాయి.
మునుపెన్నడూ లేనివిధంగా విశాఖకు ప్రత్యేక రైళ్ళు విపరీతంగా వస్తున్నాయి.వీటిలో కొన్ని కొనసాగుతున్నాయి కూడా.
జోన్ రావడానికి ముందుగా ప్రత్యేక రైళ్ళు పట్టాలెక్కడం ఇవి కొనసాగుతున్న పరిస్థితులు మరింత బలాన్నిస్తున్నాయని పలువురు భావిస్తున్నారు.అలాగే రైల్వేజోన్లను 17కి పెంచుతున్నట్టుగా ఇటీవల కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్ ప్రభు ప్రకటించారు.
ఇది కూడా విశాఖ కేంద్రంగా కొత్త రైల్వేజోన్ ఏర్పాటుకు మరో సంకేతంగా ఇక్కడి రైల్వేవర్గాలు చెబుతున్నాయి.ఈ క్రమంలోనే వచ్చే నెల తొలి వారంలో ప్రవేశ పెడతారని భావిస్తున్న కేంద్ర సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్లలో ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన ఉండే అవకాశం ఉందని బావిస్తున్నారు.
ఒకవేళ కేంద్రం ఏదైనా మాట తప్పినా.చంద్రబాబు కనీసం ఈ ఒక్కటైనా కేంద్రం నుంచి పోరాడి సాధించాలని అందరూ కోరుతున్నారు.
మరి బాబు వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.