ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు, పార్టీ యువనేత నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోన్నట్టు ఏపీ టీడీపీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం బ్రాహ్మణి భర్త నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
త్వరలో జరిగే కేబినెట్ ప్రక్షాళనలో లోకేష్కు మంత్రి పదవి రాయడం కన్ఫార్మ్ అన్న ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే ఉన్నత విద్యావంతురాలు, మేనేజ్మెంట్ రంగంలో విశేషంగా పట్టున్న బ్రాహ్మణిని సైతం టీడీపీ తరపున పాలిటిక్స్లోకి దింపాలని బాబు ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో సీఎం కేసీఆర్ ఫ్యామిలీ నుంచి నలుగురు కీలక పదవుల్లో ఉన్నారు.వీరిలో కేసీఆర్తో పాటు హరీష్రావు, కేటీఆర్ తెలంగాణ పాలిటిక్స్ శాసిస్తుంటే, ఎంపీ కవిత కేంద్రంలో తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పోరాడేస్తున్నారు.
ఈ క్రమంలోనే బ్రాహ్మణిని సైతం వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి గెలిపించి ఆమెను ఢిల్లీకి పంపాలని బాబు ప్లాన్లు వేస్తున్నట్టు తెలుస్తోంది.సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు, ఆంగ్ల భాషపై పట్టు ఉన్న బ్రాహ్మణిని ఢిల్లీకి పంపితే ఏపీకి వచ్చే నిధులు, ఇతరత్రా పనుల విషయంలో ఢిల్లీలో పనులు చక్కబెట్టే సామర్థ్యం వస్తుందని బాబు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణిని గుంటూరు లేదా అనంతపురం జిల్లాలోని హిందూపురం లోక్సభ నియోజకవర్గాల్లో ఎక్కడో ఓ చోట నుంచి ఎన్నికల బరిలోకి దింపుతారని తెలుస్తోంది.జయదేవ్ ప్రస్తుతం గుంటూరు ఎంపీగా ఉన్నారు.
బ్రాహ్మణి అక్కడి నుంచి పోటీచేసే క్రమంలో జయదేవ్ను చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తారని టాక్.
ఒక వేళ టీడీపీకి పట్టున్న అనంతపురం జిల్లాలోని హిందూపురం లోక్సభ నియోజకవర్గం నుంచి ఆమెను పోటీ చేయిస్తే అక్కడ సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్పకు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని బాబు యోచనగా తెలుస్తోంది.
ఏదేమైనా ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి బ్రాహ్మణిని ఎంపీగా బరిలోకి దింపాలన్న బలమైన కోరిక బాబు వ్యక్తం చేస్తున్నారన్న టాక్ టీడీపీలో వినిపిస్తోంది.