కన్నడంలో సూపర్ హిట్ అయిన ‘మైత్రి’ మూవీని నాగార్జున రీమేక్ చేయబోతున్నట్లుగా రెండు నెలల క్రితం మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి.అయితే తాను ఏ రీమేక్లో నటించడం లేదని, ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలు తప్ప మరే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అంటూ నాగార్జున ప్రకటించాడు.
అయితే తాజాగా ‘మైత్రి’ మూవీని చూసిన నాగార్జున రీమేక్లో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.ప్రస్తుతం రీమేక్కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఒక కొత్త దర్శకుడు చేస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ప్రస్తుతం ‘సోగ్గాడే చిన్ని నాయనో’ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్న నాగార్జున మరో వైపు కార్తీతో తెలుగు మరియు తమిళంలో ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు.‘సోగ్గాడే చిన్ని నాయనో’ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది.
కార్తీతో మల్టీస్టారర్ సినిమా ఇటీవలే ప్రారంభం అయ్యి మొదటి షెడ్యూల్ను పూర్తి చేసుకుని, రెండవ షెడ్యూల్ మొదలు పెట్టడం జరిగింది.ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత ‘మైత్రి’ రీమేక్లో నటించే అవకాశాలున్నాయని అంటున్నారు.
కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ మరియు మోహన్లాల్లు కలిసి ఈ సినిమాలో నటించారు.తెలుగులో నాగార్జునతో పాటు మరెవ్వరు నటిస్తారో చూడాలి.
ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ ముఖ్య పాత్రలో నటించనున్నాడని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.