ఇప్పుడు దేశం మొత్తం మీద బీహార్ చాలా గరంగా ఉంది.ఎందుకు తెలుసు కదా…! అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి పరువు పోగొట్టుకున్న భాజపా ఎలాగైనా సరే బీహార్లో పాగా వేయాలని తీవ్రంగా కృషి చేస్తోంది.ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేస్తున్నారు.
భాజపాను అధికారంలోకి రానివ్వకూడదని ప్రతిపక్షాలు చాలా పట్టుదలగా ఉన్నాయి.ముఖ్యమంత్రి నితీష్కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక్కటయ్యారు.‘గ్రాండ్ అలయన్్స’ (మహా కూటమి అనొచ్చు) ఏర్పాటు చేసుకున్నారు.హోరాహోరీ పోరుకు తెర తీశారు.అంతే…దెబ్బ పడింది.ఎవరి మీద? భాజపా మీద కాదు.మహా కూటమి మీద.కూటమి నుంచి తాను బయటకు వెళ్లిపోతున్నానని, ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తామని సమాజ్వాదీ అధినేత ములాయం సింగ్ ప్రకటించి సంచలనం రేపారు.సీట్లు పంచుకునే విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చాయి.సీట్ల పంపిణీకి సంబంధించి కూటమిలోని ఇతర పార్టీలు తనను సంప్రదించలేదని ములాయం అన్నారు.సమాజ్వాదీకి ఎన్ని సీట్లు ఇస్తారో స్పష్టం చేయలేదన్నారు.అంతుకే తాను ఒంటరిగా పోటీకి దిగుతానన్నారు.
బీహార్లో ములాయం పార్టీకి ఎమ్మెల్యలుగాని, ఎంపీలుగాని లేరు.మహా కూటమిలో విభేదాలు రావడం భాజపాకు, దాని మిత్ర పక్షాలకు ఎంతో సంతోషం కలిగించే విషయం.
ఈమధ్య మహా కూటమి రాజధాని పాట్నాలో బ్రహ్మాండమైన ర్యాలీ నిర్వహించింది.దీనికి ములాయం హాజరు కాకుండా పార్టీ తరపున ప్రతినిధిని పంపారు.
ములాయంను ఇతర పార్టీల నాయకులు బుజ్జగిస్తారా? లేదా ఈ విభేదాలు ఇలాగే కొనసాగుతాయా? మహాకూటమి ఐక్యంగా ఉంటేనే భాజపాకు గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది.