ఏపీలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కాపుగర్జన చేయడంతో కాపుల్లో చాలా రోజుల తర్వాత ఐక్యతారాగం వినిపించింది.కాపులందరూ ఒకేసారి వీధుల్లోకి రావడంతో చంద్రబాబు సర్కార్ చాలా టెన్షన్లో పడింది.
ఎట్టకేలకు చంద్రబాబు తన రాజకీయ మేథావితనాన్ని ఉపయోగించి ముద్రగడను చల్లార్చారు.ముద్రగడను చల్లార్చేందుకు చంద్రబాబుకు తలప్రాణం తోకమీదకు వచ్చింది.
మళ్లీ మరోసారి పాదయాత్రకు రెడీ అవుతోన్న ముద్రగడకు ఈ సారి షాక్ తప్పేలా లేదు.ఏపీలో కోస్తాలో బలంగా ఉంటోన్న కాపులత పాటు సీమలో బలంగా ఉన్న బలిజలందరూ ఇప్పటి వరకు ఏకతాటిమీదకు ఉన్నారు.
అయితే ముద్రగడ త్వరలో చేపట్టబోయే పాదయాత్రకు బలిజల మద్దతు ఉండదని ఇప్పుడు బలజలు ప్రకటించారు.ఇకపై ముద్రగడకు కాపులకు తమ మద్దతు ఉండదని బలిజనాడు ఏపీ కన్వీనర్ శివశంకర్ ప్రకటించారు.
తాము ఇకపై కాపులతో సంబంధం లేకుండా బలిజ శంఖారావం పేరుతో ఉద్యమం చేస్తామని ఆయన ప్రకటించారు.ఇక ముద్రగడ గతంలో పలు ఉద్యమాలు చేసిన మందకృష్ణ మాదిగ – పీవీ రావులను చూసి నేర్చుకోవాలని కూడా శివశంకర్ తెలిపారు.
ముద్రగడ తన కుల ఉద్యమాలకు బలిజలను వాడుకుంటూ, వైకాపా అధినేత జగన్ వ్యక్తిగత లక్ష్యం కోసం పని చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
సంఖ్యాపరంగా కాపుల కంటే ఎక్కువగా ఉన్న బలిజల ప్రయోజనాల గురించి ముద్రగడ ఎప్పుడూ పట్టించుకున్న దాఖలాలు లేవని మండిపడ్డారు.
ముద్రగడ అసలు లక్ష్యాన్ని పక్కనపెట్టి కేవలం ఓ రాజకీయ పార్టీని, ముఖ్యమంత్రిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారని.దీని వెనక ఎవరు ఉన్నారో అందరికి తెలిసిందే అని శివశంకర్ విమర్శించారు.
ఏదేమైనా కాపుల కంటే పెద్ద సంఖ్యలో ఉన్న బలిజలు దూరమైతే అది ముద్రగడకు పెద్ద షాకే అనుకోవాలి.