ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన వారి పరిస్థితి కక్కలేక మింగలేని విధంగా ఉంది! గతంలో ఒక వెలుగు వెలిగిన సీనియర్ నేతలు వివిధ పదవులు ఆశించి గులాబీ కండువా కప్పేసుకున్నారు.అనుభవం అయితే గాని తత్వం బోధపడదు అన్న చందంగా వారందరికీ ఇప్పుడు తత్వం బోధపడుతుండటంతో.
`కారు`లో ఇమడలేకపోతున్నారట.కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి.ఆ పార్టీకి ఝలక్ ఇస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సీనియర్ నేతలు గులాబీ గూటికి చేరిపోయారు! అధికారంలో ఉన్న పార్టీ కనుక తమ సీనియారిటీకి తగిన గుర్తింపు దక్కుతుందని భావించారు.అలాంటి వారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గుత్తా కూడా ఒకరు! మంత్రి పదవి ఆశించి ఆయన టీఆర్ఎస్లో చేరారని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్తో ముందుగానే చెప్పి హామీ తీసుకున్నారని అప్పట్లో వార్తలు వినిపించాయి.అయితే పార్టీలో చేరిన తర్వాత పరిస్థితి తారుమారైందని సుఖేందర్ రెడ్డి ఆవేదన చెందుతున్నారట.
మొదట్లో దక్కిన గౌరవం ఇప్పుడు దక్కకపోవడంతో తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నారని సమాచారం.నోట్ల రద్దుపై ప్రధాని మోదీకి టీఆర్ఎస్ బాసటగా నిలవడం కూడా ఆయనకు సహించలేదట.
ఇదే సమయంలో ఎంపీ పదవికి రాజీనామా చేసి తెరాస తరఫున పోటీచేస్తానని చెప్పినా.సీఎం కేసీఆర్ అందుకు ససేమిరా అంటున్నారట.
అలాగే తాను ఆశిస్తున్న మంత్రి పదవి కూడా ఇచ్చే ప్రసక్తే లేదని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారట.దీంతో గుత్తా మనస్థాపానికి గురయ్యారట.
ఉప ఎన్నికలకు వెళ్లలేక.పార్టీలో ఇమడలేక సతమతమవుతున్నారట.
ఈ పరిణామాలతో గుత్తా పరిస్థితి రెండిటికీ చెడ్డ రేవడిలా మారిందని ఆయన అనుచరులు వాపోతున్నారు.దీంతో ఆయన టీఆర్ఎస్కు రాజీనామా చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే ఈ వార్తలను గుత్తా సుఖేందర్ రెడ్డి ఖండించారు.