రాష్ట్రంలో ఎం.ఎల్.
సీ పదవుల రాజకీయం ఊపందుకుంది.మంత్రి వర్గ విస్తరణ పై సీమాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు.
తాజాగా అందిన వివరాల ప్రకారం…అనుభవం ఉన్న నాయకులను కేబినెట్-లోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.పార్టీలోనూ, పాలనలోనూ తలపండిన పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గాలి ముద్దు కృష్ణమ నాయుడులను శాసనమండలి సభ్యులుగా స్థానం కల్పించి కేబినెట్-లోకి తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.
శాసన మండలి ఎన్నికల తర్వాత, ఉగాదికి కేబినెట్ విస్తరణకు ముహూర్తం పెట్టినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్నవారిని కేబినెట్-లోకి తీసుకోవడం ద్వారా పాలనలో బలాన్ని చూపించాలని భావిస్తున్నారు.
ప్రస్తుతం కేబినెట్-లో ఉన్న వారిలో సగానికి పైగా మొదటిసారి మంత్రులుగా బాధ్యతలు చేపట్టినవారే.రావెల కిషోర్, కామినేని శ్రీనివాసరావు, పైడికొండల మాణిక్యాలరావు, పి.నారాయణ లాంటి వారు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి కేబినెట్-లో స్థానం సంపాదించారు.ఫస్ట్ టైమ్ మినిస్టర్-లుగా ఉన్నవారు ఆశించినంతగా పనిచేయలేకపోతున్నారని టీడీపీ వర్గాల భావన.
సీనియర్లను తీసుకోవడం ద్వారా శాసనసభలో దీటుగా సమాధానం చెప్పడంతో పాటు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి సేవచేసిన వారికి సముచిత స్థానం కల్పించినట్లు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.ఏది ఏమైనా చంద్రబాబు మరోసారి తనం మార్క్ క్యాబినెట్ పైనే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది.