ఓ లేడీ ఎస్ఐతో ఎమ్మెల్యే ప్రేమాయణం వార్తలు కర్ణాటకలో సంచలనంగా మారాయి.రాయచూరు జిల్లా రాయచూర్ గ్రామీణ ఎమ్మెల్యే తిప్పరాజు హవల్దార్ ఓ మహిళా ఎస్ఐ ప్రేమకలాపం సాగిస్తున్నట్లు బుధవారం కొన్ని టీవీ ఛానెళ్లలో వార్తలు హోరెత్తిపోయాయి.
ఎమ్మెల్యే తిప్పరాజు స్థానిక మార్కెట్ యార్డులో గతంలో ఎస్ఐగా పనిచేసిన ఓ మహిళా ఎస్ఐతో ప్రేమాయణం కొనసాగించి, ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మీడియాలో ప్రచారం జరిగింది.
ఎస్ఐతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఎమ్మెల్యే భార్య, పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మెల్యే భార్య పేరుతో గత మార్చి 16న రాష్ట్ర మహిళా కమిషన్కు లేఖ వెళ్లింది.
దీనిపై మహిళా కమిషన్ స్పందించడంతో ఈ వార్తలు కలకలం రేపాయి.అయితే ఈ లేఖపై ఎమ్మెల్యే భార్య నుంచి షాకింగ్ రిప్లే వచ్చింది.
తాను ఆ లేఖ రాయలేదని ఎమ్మెల్యే భార్య, మాన్వి తాలూకా కుర్డి జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఉన్న విరుపమ్మ (సౌమ్య) చెపుతోంది.
ఇక ఎమ్మెల్యే తిప్పరాజు మాట్లాడుతూ తనకు, తన భార్యకు మధ్య గొడవల్లేవని, తాను అన్యోన్యంగా ఉంటున్నామని, తనకు మహిళా ఎస్ఐతో వివాహేతర సంబంధం ఉందని వస్తోన్న వార్తల్లో నిజం లేదంటున్నారు.
తనపై బురద జల్లడానికి ఎవరో కావాలనే మహిళా కమిషన్కు లేఖ రాసినట్టు ఆయన ఆరోపిస్తున్నారు.ఇక మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మీబాయిపై కూడా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆమె తమపై వచ్చిన ఆరోపణను తమతో చర్చించకుండానే ప్రతిని మీడియాకు విడుదల చేయడం చూస్తుంటే తనను రాజకీయంగా అణిచి వేసేందుకు రాజకీయ ప్రత్యర్థులు ఆడుతోన్న ఆటలో ఇదంతా భగంగా ఆయన విమర్శించారు.ఇక ఎమ్మెల్యేతో వివాహేతర సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటోన్న లేడీ ఎస్ఐ బేబీ వాలేకర్ మీడియాతో మాట్లాడుతూ… తన పరువుకు నష్టం కలిగించేలా కొంతమంది ప్రవర్తిస్తున్నారని…తాను ఏ తప్పూ చేయలేదని…తనకు పరువు నష్టం కలిగించేలా చేసిన వారిపై పరువు నష్టం దావా చేస్తానని ఆమె చెప్పారు.
ఏదేమైనా ఎమ్మెల్యే, లేడీ ఎస్ఐ ప్రేమాయణం వార్తలు కన్నడ మీడియాలో నిన్నంతా ప్రకంపనలు రేపాయి.