ఏపీలో అధికార టీడీపీ బలోపేతం కోసం చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు రివర్స్ అవుతోంది.చాలా నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ ఇన్చార్జ్లకు పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు మధ్య కూల్ వాటర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోంది.
నిన్నటి వరకు ఆధిపత్య పోరు వరకే సాగిన ఈ వార్ ఇప్పుడు ఏకంగా చొక్కాలు చింపుకుని కొట్టుకునే వరకు వెళ్లింది.ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్సెస్ ఎమ్మెల్సీ కరణం బలరాం మధ్య ఆధిపత్య పోరు ఏ స్థాయికి దారితీసిందో చూస్తూనే ఉన్నాం.
గొట్టిపాటి టీడీపీ ఎంట్రీని ముందునుంచి వ్యతిరేకిస్తోన్న బలరాం ఆయనతో వీలు దొరికినప్పుడల్లా సై అంటే సై అంటున్నారు.చంద్రబాబు సైతం వీరి వార్కు సరైన పరిష్కారం చూపడంలో ఫెయిల్ అయ్యారు.
వీరి మధ్య వార్తో నియోజకవర్గంలో టీడీపీ వర్గాలు రెండుగా చీలిపోయాయి.అభివృద్ది పనులు దక్కించుకునేందుకు ఇరువురు పోటీపడడంతో నియోజకవర్గంలో ఇరువురు నేతల గొడవలు మరింత పెరిగాయి.
పదేళ్ల తర్వాత ఇక్కడ మళ్లీ హత్యారాజకీయాలు మొదలయ్యాయి.
ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా ఒంగోలులో ముగ్గురు మంత్రుల సమక్షంలో జరిగిన గొడవతో ఎమ్మెల్యే గొట్టిపాటి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.
అక్కడ గొడవలో కిందపడ్డ రవికుమార్ చొక్కా సైతం చిరిగిపోయింది.ముగ్గురు మంత్రుల సమక్షంలోనే ఇదంతా జరిగినా వారు సైతం బలరాంను నిలువరించడంలో ఫెయిల్ అయ్యారు.
తనకు జరిగిన అవమానాన్ని సీఎం చంద్రబాబును కలిసి వివరించేందుకు గొట్టిపాటి విశ్వప్రయత్నాలు చేశారు.
ఆయనకు చంద్రబాబు అపాయింట్మెంట్ ఇచ్చాక కూడా క్యాన్సిల్ అయ్యినట్టు సమాచారం.
ఇక ఒంగోలులో గొడవ జరిగిన వెంటనే గొట్టిపాటి జిల్లాలో తనతో పాటు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్రెడ్డితో కలిసి ఒకే వాహనంలో వెళ్లిపోయారు.పార్టీలో ఇంత అవమానం జరుగుతుంటే ఇక ఇక్కడ ఉండి లాభం లేదని…తిరిగి వైసీపీలోకి వెళ్లిపోతేనే మంచిదని ఆయన తన సన్నిహితులతో పాటు సహచర ప్రజాప్రతినిధుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఏదేమైనా అద్దంకి నియోజకవర్గంలో బలరాం జోక్యంకు చంద్రబాబు అడ్డుకట్ట వేయకపోతే చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్ అయ్యి గొట్టిపాటి తిరిగి వైసీపీలోకి వెళ్లిపోతారన్న చర్చలే ఎక్కువుగా ప్రకాశం జిల్లాలో వినిపిస్తున్నాయి.