ఆయన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి.ఆయన పిలిస్తే మంత్రులు పరిగెత్తుకుంటూ వచ్చేంత స్థాయి ఆయనది.
పైగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమానికి మంత్రులు ఆయనకు ఎంతో సహకరించాలి.తెలంగాణలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది.125 అడుగుల ఎత్తైన విగ్రహ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ కూడా ప్రకటన చేశారు.
నెక్లెస్ రోడ్డు సమీపంలో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటుకు కేసీఆర్ డిప్యూటీ సీఎం అధ్యక్షతన ఓ కమిటీ వేశారు.
ఈ కమిటీలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్వర్ రెడ్డి, నాయని నరసింహారెడ్డి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ఘంటా చక్రపాణి కూడా ఉన్నారు.మంగళవారం ఈ కమిటీ సమావేశం ఉంటుందని సదరు మంత్రులకు నెల రోజుల ముందే సమాచారం ఇచ్చారు.
అయితే మంగళవారం కమిటీ సమావేశానికి ఏ ఒక్క మంత్రి హాజరు కాలేదు.అధికారులతో పాటు ఘంటా చక్రపాణి మాత్రమే హాజరవ్వడంతో కడియ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.
గతంలో ఈ కమిటీ సభ్యులు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి పలు అంబేద్కర్ విగ్రహాలు పరిశీలించి వచ్చారు కూడా.ఇక డిసెంబర్ 6వ తేదీ నాటికే విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నా మంత్రులెవరూ తనకు సహకరించడం లేదని కడియం వాపోతున్నారు.
దీనిపై కడియం సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక కేసీఆర్ అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుపై ప్రకటన చేసి యేడాది అవుతున్నా ఇప్పటి వరకు విగ్రహ ఏర్పాటు కోసం నమూనా కూడా సిద్ధం కాకకపోవడంతో కడియం తీవ్ర అసహనంతో ఉన్నారు.
ఇక ఈ కమిటీలో ఉన్న మంత్రులకు డిప్యూటీ సీఎం అంటే అంత చులకనా ? అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మరి ఈ వివాదం సీఎం వద్దకు వెళితే ఎలాంటి రిప్లై ఉంటుందో ? చూడాలి.