`దేశ భాషలందు తెలుగు లెస్స`.తేనెలొలుకు భాష తెలుగు! ఈ భాష గొప్పదనాన్ని, ఔన్నత్యాన్ని వర్ణిస్తూ.
ఎంతో మంది కవులు కావ్యాలు, కవితలు రాశారు.తెలుగు భాషకు పట్టం కట్టారు.
పొరుగు రాష్ట్రాలు కూడా తమ మాతృ భాషను అందలం ఎక్కించేందుకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.కానీ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలుగును పూర్తిగా కనుమరుగు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు మంత్రి నారాయణ వంటి కొంతమంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తెలుగు మృతభాషగా మారిపోతోందని భాషా వేత్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మరోపక్క తెలుగుకు పట్టం కడతామని చెబుతున్న ప్రభుత్వమే.తెలుగు భాషను చంపేసేందుకు నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.ఈ నిర్ణయంపై భాషావాదులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
చిన్నతనంలోనే తెలుగును పిల్లలకు దూరం చేస్తే.వారి భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని విచారం వ్యక్తంచేస్తున్నారు.
కార్పొరేట్ విద్యా వ్యాపారాలు పెంచుకోవడం కోసమే ఆంగ్ల భాష తప్ప మరో భాష చదవకూడదనే వాతావరణం మంత్రి నారాయణ సృష్టిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.94 శాతం మంది ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలని, ఉన్నత పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలు ఉండాలని గతంలో నిర్ణయించారు.
అయితే మున్సిపల్ శాఖ మంత్రి ఏకపక్ష నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి.ఆంగ్ల మాధ్యమంలో పుస్తకాల్లేకుండా, బోధించడానికి ఉపాధ్యాయులు లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థులకు శరాఘాతమేనని విమర్శిస్తున్నాయి.