ఏపీ సీఎం చంద్రబాబు కేబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్న ఓ మంత్రి ఓ షాకింగ్ డెసిషన్ తీసుకోనున్నారా ? ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి వచ్చే ఎన్నికల నాటికి కొత్తదారులు వెతుక్కోనున్నారా ? అంటే అవుననే సమాధానాలు ఏపీ పొలిటికల్ ఇన్నర్ కారిడార్లో జోరుగా చర్చకు వస్తున్నాయి.ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఏ పార్టీలో చేరినా గెలుస్తూ వస్తున్నారు.
2004లో టీడీపీ నుంచి, 2009లో ప్రజారాజ్యం నుంచి, తిరిగి 2014లో టీడీపీ నుంచి ఆయన వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నారు.మధ్యలో ఆయన కాంగ్రెస్ నుంచి మంత్రిగా కూడా పనిచేశారు.
గత ఎన్నికలకు తన గ్రూప్ సభ్యులందరితోను కలిస టీడీపీలో చేరిపోయిన గంటా మరోసారి బాబు కేబినెట్లో మంత్రి అయ్యారు.
ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉన్నా తనకు సరైన ప్రయారిటీ దక్కకపోవడంతో లోలోన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని సమాచారం.
జిల్లా వరకు చంద్రబాబు మరో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడితో పాటు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి శ్రీరామకృష్ణబాబు వర్గానికి ప్రయారిటీ ఇస్తుండడం గంటా వర్గానికి అస్సలు నచ్చడం లేదు.చంద్రబాబుతో పాటు బాలయ్య, లోకేష్ సైతం గంటా కంటే అయ్యన్న చెప్పినట్టే చేయాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారట.
ఇక లోకేష్ ఇటీవల విశాఖలో కీలక అంశాల్లో గంటాకు చెప్పకుండా జోక్యం చేసుకోవడం కూడా గంటాకు మండిపోయేలా చేసిందని తెలుస్తోంది.ఇక ఏపీలో ఇప్పుడిప్పుడే టీడీపీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తుండడంతో పాటు పార్టీలో ప్రయారిటీ లేకపోవడంతో గంటా వచ్చే ఎన్నికలకు కాస్త ముందుగానే తన గ్యాంగ్తో మరోసారి టీడీపీకి గుడ్ బై చెప్పేసి పవన్ జనసేన లేదా, వైసీపీలోకి జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
మరి గంటా పొలిటికల్ రూటు ఎలా టర్న్ అవుతుందో చూడాలి.