కేసీఆర్ కేబినెట్లో మంత్రులుగా ఉన్న ఓ కీలక మంత్రిపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వ్యక్తమవుతుండడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది.కేసీఆర్ కేబినెట్లో గ్రేటర్ హైదరాబాద్ నుంచి ప్రాథినిత్యం వహిస్తోన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భారీ స్థాయిలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి.
హైదరాబాద్ ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపులు జరిగాయి.ఈ ఇళ్ల కేటాయింపుల్లో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మంత్రి తలసాని అండతోనే ఇవన్నీ జరిగినట్టు ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.ఈ క్రమంలోనే సనత్నగర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్రెడ్డి సైతం మంత్రిని టార్గెట్ చేసుకుని పలు విమర్శలు చేశారు.
ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై శశిధర్ రెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేయగా… ఆ విచారణలో అవి వాస్తవాలు అని తేలినట్టు కూడా శశిధర్ రెడ్డి చెపుతున్నారు.ఈ క్రమంలోనే శశిధర్ రెడ్డితో పాటు మిగిలిన విపక్షాల నాయకులు కేసీఆర్ తలసానిని మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
తలసానిపై కేసీఆర్ ఆరా… కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ నుంచి కేబినెట్లో ఉన్న తలసానిపై ఈ స్థాయిలో ఆరోపణలు రావడంపై సీఎం కేసీఆర్ సైతం ఆరా తీసినట్టు తెలుస్తోంది.తలసానిపై ఇప్పటికే పలుసార్లు ఆరోపణలు రావడంతో పాటు అవి కంటిన్యూ అవుతుండడంపై కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక త్వరలో జరిగే కేబినెట్ ప్రక్షాళనలో సైతం కేసీఆర్ తలసానిని మంత్రి పదవి నుంచి తప్పిస్తారని కూడా సమాచారం.