నిన్న తెలంగాణ సచివాలయం ఎదుట దేవేందర్ అనే 38 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసాడు.ఆ సమయంలో అతనితో భార్యపిల్లలు కూడా ఉన్నారు.
వారి సమక్షంలోనే తెచ్చుకున్న పురుగుల మందు తాగి కుప్పకూలాడు దేవేందర్.పోలీసులు వెంటనే అతడిని హాస్పిటల్ కి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు డాక్టర్లు.
పురుగుల మందు తాగేముందు ఓ లేఖను వదిలాడు దేవేందర్.ఆ లేఖలో, ఇద్దరు టీఆర్ఎస్ నాయకులతో పాటు, ఒక జాయింట్ కలెక్టర్ ని, మెగాస్టార్ చిరంజీవిని తన దుస్థితికి కారణంగా చెప్పాడు దేవేందర్.
పూర్తి వివరాల్లోకి వెళితే నిర్మాల్ జిల్లా, తిమ్మాపూర్ కి చెందిన దేవేందర్ చిరంజీవి మీద అభిమానంతో ప్రజారాజ్యం కార్యకర్తగా పనిచేసాడట.కాని తాను పార్టీకోసం పడిన కష్టం తన ఎదుగుదలకి ఉపయోగపడకపోగా, చిరంజీవి పార్టీని విలీనం చేయడంతో తన జీవితం నాశనం అయ్యిందని దేవేందర్ భావిస్తున్నాడు.
లేఖలో చిరంజీవితో పాటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శివలింగయ్యల పేర్లు కూడా ఉన్నాయి.ఈ ముగ్గురు గత కొన్నేళ్లుగా తనని వేధిస్తున్నారని, తనకి ఉపాధి లేకుండా చేసారని, వీరి వలన ఆర్థికంగా క్షీణించిపోయి ఓ కొడుకుని కూడా పోగొట్టుకున్నానని దేవేందర్ లేఖలో పేర్కొన్నాడు.
తన కష్టాలు చెప్పుకోవడానికి చిరంజీవిని, పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసినా, వారి దాకా చేరుకోలేకపోయానని, తను ప్రాణాలు వదిలేస్తే తన భార్యపిల్లలకి పవన్ కళ్యాణ్ ఆర్ధిక సహాయం చేసి ఆదుకోవాలని తన సూసైడ్ నోట్ లో చెప్పుకొచ్చాడు దేవేందర్.అలాగే తనను ప్రగతి భవన్ ముందు సమాధి చేయాలని కోరుకున్నాడు.