వైసీపీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.ప్రకాశం జిల్లాకు చెందిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావులు కొన్ని రోజులుగా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
గురువారం వైస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి కూడా వీరిద్దరు గైర్హాజరయ్యారు.దీంతో వీరిద్దరు సైకిలెక్కడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది.
ఇప్పటికే ఎమ్మెల్యేలిద్దరు తమ, తమ నియోజకవర్గంల్లోని పార్టీ కార్యకర్తలు, ముఖ్య అనుచరులతో సమావేశమై టీడీపీలో చేరికపై చర్చించినట్లు సమాచారం.ఇటీవల కాలంలో వైస్సార్సీపీ నుంచి అధికార పార్టీలోకి ఎమ్మెల్యేల వలసలు ఆగిపోయిన విషయం తెలిసిందే.
అయితే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో తాజాగా మరో ఇద్దరు వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సన్నాహాలు చేసుకుంటు న్నారని వార్తలు వెలువడడంపై ఆ పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా యి.రాజ్యసభ ఎన్నికల నాటికి మరికొంతమంది వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.అయితే ఎంతమంది అన్నది టీడీపీ నేతలు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నప్పటికీ, దశలవారిగా మరో పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించే అవకాశాలున్నట్లు మీడియాకు లీకులిస్తున్నారు.