మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ చాలా పాపులర్.ఆయన్ని తెలియనవారు చాలా తక్కువ.
ఆయన ఐఏఎస్ అధికారిగా రిటైర్ అయ్యుంటే ఇంత పేరు వచ్చేది కాదు.కాని ‘లోక్సత్తా’ అనే సంస్థను స్థాపించి, తరువాత దాన్ని రాజకీయ పార్టీగా మార్చి ఎన్నికల్లోనూ పోటీ చేయడంతో ఆయన పాపులర్ అయ్యారు.
అయితే వ్యక్తిగా డాక్టర్ జేపీ పాపులర్ అయినంతగా ఆయన స్థాపించిన లోక్సత్తా పార్టీ కాలేకపోయింది.ప్రజలకు కొత్త తరహా రాజకీయాలు నేర్పించాలన్న ఆయన కోరిక తీరలేదు.
వ్యక్తిగా ఆయన్ని గౌరవించేవారు కూడా ఆయన పార్టీకి ఓటేయరు.రెండువేల ఆరో సంవత్సరంలో లోక్సత్తాను రాజకీయ పార్టీగా మార్చారు.
రెండువేల తొమ్మిదో సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో డాక్టర్ జేపీ హైదరాబాదులోని కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మల్యేగా గెలిచారు.గత ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
అయినప్పటికీ జేపీ ఇప్పటికీ రాజకీయ రంగంలో కొనసాగుతూనే ఉన్నారు.పార్టీలనూ చీలికలు వచ్చినా, అసమ్మతి రాగాలు వినిపించినా జేపీ తన బాట వీడలేదు.
కాని లోక్సత్తా ఇతర పార్టీల వంటిది కాదు.ఉద్యమాలు, ధర్నాలు చేయదు.
ఆందోళనలు నిర్వహించదు.అందుకే జేపీ మేధావిగా పేరు పొందినా ప్రజా నాయకుడిగా ఎదగలేదు.
తాను స్వయంగా ఆందోళనలు చేయడం కంటే ప్రజలను ఎడ్యుకేట్ చేయడంపైనే దృష్టి పెట్టారు.ప్రజా సమస్యలపై కూలంకషంగా మాట్లాడగల సత్తా జేపీకి ఉంది.
కాని ఎన్నికల్లో సత్తా చూపలేకపోతున్నది.గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చూపలేకపోయినా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది.
ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది.ప్రజా సమస్యలను ప్రచార అస్ర్తాలుగా చేసుకోవాలని తీర్మానించింది.
నరేంద్ర మోదీ పాలనపై లోక్సత్తా తీవ్ర అసంతృప్తిగా ఉంది.తెలంగాణలో టీఆర్ఎస్ పరిపాలన కూడా బాగాలేదని అభిప్రాయపడింది.
జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్ని స్థానాలైనా సాధించి ఉనికిని కాపాడుకోవాలని అనుకుంటోంది.మరి ప్రధాన పార్టీల పోటీని తట్టుకోగలుగుతుందా?
.