రాజకీయాలు నానాటికీ భ్రష్టు పట్టిపోతున్నాయి! ప్రెజెంట్ పాలిటిక్స్ చూస్తుంటే ఏవగింపు పుడుతోంది! ఏ నలుగురు కలిసినా ఇలాంటి కామెంట్లు వినిపించడం కామనై పోయింది! అంతేకాదు, ఆ నేత అంత తిన్నాడు, ఈ నేత ఇంత వెనుకేసుకున్నాడు లాంటి చర్చలకు లెక్కేలేదు.నిజమే!! పాలిటిక్స్ నేడు పాలిట్రిక్స్గానే మారిపోయాయి.
ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెడుతున్నాం… ఆ మాత్రం సంపాయించుకుంటే తప్పేంటి? అని నేరుగా పబ్లిక్లోనే ప్రశ్నిస్తున్న నేతలను మనం చూస్తున్నాం.ముక్కున వేలేస్తున్నాం!!
అయితే, పాలిటిక్స్లో ఉన్న వాళ్లంతా ఇలానే ఉన్నారా? అందరూ సొంత లాభాల కోసమే పాలిటిక్స్లోకి వస్తున్నారా? వారసత్వ రాజకీయాలకు పాదు కట్టి.ఎరువు పెట్టి.ప్రాపు చేస్తున్నారా? రాజకీయం అంటే హద్దు , అదుపులేని అధికారం చలాయించడం, అందినకాడికి దండుకోవడమేనా? అంటే.కాదని చెప్పేవారూ, పలువురికీ ఆదర్శంగా ఉండే వారూ.వేలల్లో ఒక్కరై రికార్డు సృష్టించే వారూ ఒకరిద్దరు ఉన్నారు.
అలాంటి వారు సమాజం కోసం, సమాజంలోని అణగారిన వర్గాల కోసం నిత్యం పోరు సల్పుతూనే ఉంటారు.జన హితమే తమ విహిత ధర్మంగా అడుగులేస్తూనే ఉన్నారు!
అలాంటి వారిలో మట్టిలో మాణిక్యం వంటి నేత నాగభైరవ జయప్రకాశ్ నారాయణ.
అందరూ జేపీగా పిలుచుకునే ఈయన.ఆదర్శ రాజకీయాలకు పెట్టింది పేరు.
రాజకీయాలంటే.ఒకరినొకరు తిట్టుకోవడం కాదు.
రాజకీయాలంటే.అధికారం చలాయించడం కాదు.
అని పదేపదే చెప్పుకొచ్చే జేపీ.కూకట్పల్లి ఎమెల్యేగా ఉన్న సమయంలో ఈ రెండు మాటలను తన ప్రవర్తన ద్వారా ఆచరించి చూపి ఆదర్శంగా నిలిచారు.
లోక్సత్తా – పేరుతో ఓ సామాజిక ఉద్యమ సంస్థను స్థాపించిన జేపీ.అవినీతిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, సామాజిక బాధ్యతను రగిలించేందుకు ఎంతగానో శ్రమించారు.
లోకసత్తా జేపీగా ప్రజా బాహుళ్యంలో ప్రత్యేక గుర్తింపు పొందారు.
వాస్తవానికి ఐఏఎస్ అధికారి అయిన జేపీ.
మహారాష్ట్రలో తెలుగు మాట్లాడే వారి ఇంట జన్మించారు.ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో జాయింట్ కలెక్టర్గా, కలెక్టర్గా అనేక జిల్లాల్లో ఆయన పనిచేశారు.
రాష్ట్ర ప్రజల స్థితిగతులపై విధుల్లో ఉండగానే అధ్యయనం చేశారు.అదేసమయంలో సమాజంలో పెచ్చరిల్లిన అవినీతి ఆయనను కంటిపై కునుకులేకుండా చేసింది.
సమాజానికి తనవంతుగా ఏదో ఒకటి చేయాలని ఆయన ఆ క్షణంలోనే డిసైడ్ అయ్యారు.ఈ క్రమంలో ఉద్భవించిందే లోక్సత్తా ఉద్యమం.
లోక్సత్తా.ఇది మీ సత్తా.నినాదంతో ఆయన సామాన్యల్లో సంచలనం సృష్టించారు.సమాజ హితం కోసం ఉద్యోగాన్ని సైతం వదులుకుని ప్రత్యక్ష సేవలోకి దిగారు.
అవినీతిని అంతం చేయాలంటే ప్రజలు విద్యావంతులై ఉండాలనేది ఆయన సిద్దాంతం.ఈ క్రమంలోనే విద్యను ప్రోత్సహించారు.
ఇలా ప్రారంభమైన లోక్సత్తా ప్రస్థానం.గల్లీ నుంచి ఢిల్లీ వరకు సాగింది.
అయితే, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ద్వారా మరింతగా సమాజానికి సేవ చేయొచ్చన్న ఏకైక ఆలోచనతో 2009లో లోక్సత్తా సామాజిక సంస్థను రాజకీయ సంస్థగా మార్చారు.
అప్పటి ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా హైదరాబాద్లోని కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు.
తన ఐదేళ్ల ఎమ్మెల్యే పదవీ కాలంలో నియోజకవర్గం అభివృద్ధికి ఎంతగానో శ్రమించారు.వార్డు మెంబర్కే కారుంటున్న ప్రస్తుత రోజుల్లో.
ఎమ్మెల్యే అయినప్పటికీ.జేపీ.
కాలినడకన నియోజకవర్గంలో కలియదిరిగి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.ఈ పరిణామం ఆయనను ప్రజల్లో దేవుడిని చేసింది.
నిజాయితీగల రాజకీయ నేతగా నిలబెట్టింది.
వ్యాసకర్తగా, వక్తగా, మేధావిగా, ఆలోచనా పరుడిగా అందరిలోనూ గుర్తింపు పొందిన జేపీ.
అహరహం సామాన్యుల కన్నీళ్లను తుడిచేందుకు, సమాజంలోని మకిలిని కడిగేందుకు తనవంతు ప్రయత్నం ఏనాడూ మానలేదు.రైతు కాడి మోస్తున్నాడు.
ఏసు శిలువను మోసినట్టు అన్న గుంటూరు శేషేంద్ర శర్మ వ్యాఖ్యలను పదే పదే గుర్తు చేసే జేపీ.రైతుకు కనీస గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వాల విహిత ధర్మంగా అసెంబ్లీలో ఎలుగెత్తారు.
నెలకు కనీసంలో కనీసం 5 వేల రూపాయల ఆదాయం ఉంటే.రైతులు ఆత్మహత్యలు చేసుకోరంటూ అసలు వాస్తవాన్ని నిండు సభలో వివరించారు.
పెడ చెవిన పెడుతున్న ప్రభుత్వాలకు వివిధ రాష్ట్రాల్లో జరుగుతోందో ససాక్ష్యంగా వివరించారు.ఇలా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ ప్రజల కోసం మలిచిన రాజకీయ శిల్పి జేపీ!!
ఇంతవరకు బాగానే ఉన్నా.
నిజానికి జేపీ వంటి నిజాయితీ పరులకి మనం చేసింది ఏమిటి? ఆయనలోని మంచి తనానికి మనం ఇచ్చిన బహుమానం ఏమిటి? మరోసారి ఎన్నికల్లో నిలబడ్డ ఆయనను చిత్తులా ఓడించాం.ఆయన పెట్టిన లోక్సత్తా పార్టీ తరఫున నిలబడ్డ వారికి కనీసం డిపాజిట్లు అయినా లభించేలా చేయలేకపోయాం! ఇదీ మనం మంచి వారికి చేస్తున్న సత్కారం! రాజకీయాలు మారాలని కోరుకుంటాం! పాలిటిక్స్లో పరమ సత్యవంతులు ఉండాలని ఆశిస్తున్నాం! కానీ, ఓటు వేయాల్సి వచ్చే సరికి మాత్రం మనం మనకు తెలియని మైకంలో మునిగిపోతున్నాం.
మనకు ఎవరు కావాలో? ఎలాంటి వ్యక్తులు మనను పాలించాలో మనకు మనమే నిర్ణయించుకునే స్థితిలో ఉండి కూడా.అచేతన స్థితిలోకి జారుకుంటున్నాం.
ఫలితంగా జేపీ వంటి నిజాయితీ పరులు తెరమరుగు కావాల్సిన పరిస్థితి దాపురిస్తోంది.నిజానికి రాజకీయాల్లో నిజాన్ని, నిజాయితీని కాంక్షించే ప్రతి ఒక్కరూ జేపీ వంటి నేతలకు జై కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నానాటికీ మృగ్యమైపోతున్న విలువలను కాపాడి నాలుగు తరాలకు అందించే జేపీ వంటి నేతలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉంది.ఇప్పటికైనా మనం మారదాం! మన వ్యవస్థను మారుద్దాం!! జేపీలకు జై కొడదాం… మంచికి పట్టం కడదాం!!
.