విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)కి ఏపీ సీఎం చంద్రబాబు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా ? ఇటీవల పార్టీపై బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్న నానిని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పక్కన పెట్టనున్నారా ? కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజ్గోపాల్కు చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు ఇచ్చే యోచనలో ఉన్నారా ? అంటే తాజా పరిణామాలతో అవుననే గుసగుసలు విజయవాడలో వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.
వెలగపూడిలోని సచివాలయంలో వీరిద్దరు సుమారు 40 నిమిషాలు ఏకాంతంగా చర్చలు జరపడం ఏపీ రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది.చంద్రబాబుతో భేటీ తర్వాత లగడపాటి ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు.
వెలగపూడి సచివాలయం సూపర్గా ఉందంటూ కితాబిచ్చారు.
విజయవాడ నుంచి 2004, 2009లో రెండుసార్లు ఎంపీగా గెలిచిన లగడపాటి రాష్ట్ర విభజన తర్వాత తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇక విజయవాడ టీడీపీ ఎంపీ నాని కొద్ది రోజులుగా చంద్రబాబుపై అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
తన కేశినేని ట్రావెల్స్ సైతం ఆయన మూసివేశారు.ఈ విషయంలో చంద్రబాబు నిర్ణయాన్ని సైతం ఆయన పట్టించుకోలేదు సరికదా…పరోక్షంగా చంద్రబాబు ప్రభుత్వ పనితీరును సైతం ఆయన ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే కేశినేని నానికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారా ? అందుకే లగడపాటిని ఆయన తెరమీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారా ? అన్న డౌట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ భేటీపై టీడీపీ వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి.
ఇక జిల్లాకు చెందిన ఓ మంత్రి సైతం కేశినేని నానిని రాజకీయంగా అణగదొక్కేందుకు తెరవెనక తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు భోగట్టా.!
.