తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండ రాంకి, కేసీఆర్ ప్రభుత్వానికి మధ్య నీళ్లే.నిప్పై మండుతోంది! ఇటీవల కొన్నాళ్లుగా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కోదండ రాం.
అటు ప్రభుత్వాన్ని, ఇటు కేసీఆర్ను కూడా తీవ్రంగా ఉతికి ఆరేస్తున్నారు.ముఖ్యంగా సీఎం కేసీఆర్ సువిశాలంగా నిర్మించుకున్న అధికార నివాసం ప్రగతి భవన్పైనా కోదండ రాం నిప్పులు చెరిగారు.
మరో ఘటనలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మల్లన్నసాగర్ నిర్వాసితులకు అనుకూలంగా గళం విప్పారు.
ఈ పరిణామాలతో తీవ్రంగా ఆగ్రహించిన అధికార పార్టీ.కోదండ రాంపై ఎదురు దాడికి రెడీ అయిపోయింది.భారీ వ్యాఖ్యలతో విరుచుకుపడింది.
తాజాగా.మీడియాతో మాట్లాడిన తెలంగాణ ఐటీ మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీఆర్ కోదండ రాంపై నిప్పులు చెరిగారు.
టీడీపీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగేందుకు, చిప్పకూడు తిన్న నేత(రేవంత్ రెడ్డి)ల పక్కన కూర్చునేందుకు సిగ్గులేదా? అని నేరుగా ప్రశ్నించారు.ప్రభుత్వాన్ని విమర్శించడమే పనా? అని ప్రశ్నించారు.ప్రభుత్వంపై, ప్రాజెక్టులపై విమర్శల ద్వారా కోదండరాం తన స్థాయిని తగ్గించుకుంటున్నాని మండిపడ్డారు.
రాష్ట్రంలో 40 ఏళ్లుగా పూర్తి కాని ప్రాజెక్టులు తెలంగాణలో ఉన్నాయని, అన్ని పనులూ ఏకకాలంలో చేపట్టి వేగంగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తుంటే అర్థం చేసుకోకుండా కోదండరాం ప్రతిపక్షాలకు వంత పాడుతున్నారని నిప్పులు చెరిగారు.
తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీళ్ల కోసం కాదా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా టెంటు వేస్తే ఆ వేదికను పంచుకుంటారా? విద్యావంతులు, మేధావులు చేయాల్సిన పనేనా ఇది? అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.గతంలో ఎప్పుడూ కేటీఆర్ ఈ రేంజ్లో కోదండరాంపై ఆగ్రహించిన సందర్భం లేకపోవడం తాజా పరిణామం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తమ పార్టీ రాష్ట్రంలోని అన్ని అభివృద్ధి పనులనూ టైం లోపలే పూర్తి చేస్తుందన్నారు.పేదలకు డబుల్ బెడ్ రూం ఫ్లాట్లను నిర్మించి ఇస్తామన్నారు.
ఇక, తమ పార్టీలోకి సాగుతున్న పార్టీ ఫిరాయింపులను మంత్రి కేటీఆర్ సమర్ధించారు.“ఇతర పార్టీల వారు మా పార్టీలో చేరడం మాపై పెరిగిన విశ్వాసానికి ప్రతీకగా భావిస్తున్నాం.
ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని ఆమోదించారు కనుక ఆయన సారథ్యంలో పని చేద్దామని వస్తుంటారు.పీసీసీ ప్రెసిడెంట్లుగా పనిచేసినవాళ్లు కూడా వస్తున్నారు.కాదంటామా?” అని ప్రశ్నించారు.ఏదేమైనా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కోదండరాంను మెయిన్ టార్గెట్గా చేసుకుని.
ఆయనే లక్ష్యంగా వరుస దాడులు చేస్తోంది.