బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీద పార్టీలో వ్యతిరేకత పెరిగిపోతోంది.ఎవరో ఒక నాయకుడు ఆయన మీద ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు.
కిషన్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నాడని, పార్టీలో ఇతర నాయకులను ఎదగనివ్వకుండా చేస్తున్నాడని కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు.తెలుగు దేశం పార్టీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి బీజేపీలో చేరాక డమ్మీ అయిపోయారు.
అక్కడ ఆయన జీవితం ఎదుగూ బొదుగూ లేకుండా అయింది.దీంతో ఆయన పార్టీలోనే ఉన్నా అంటీ ముట్టకుండా ఉన్నారు.
తన ఉనికిని కాడుకోవడానికి తెలంగాణా బచావో అనే సంస్థను పెట్టి ఏవో కార్యక్రమాలు చేస్తున్నారు.ప్రస్తుతం ఆయన వాయిస్ వినపడటం లేదు.
కొంత కాలం క్రితం బిజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.ఆయన కూడా కిషన్ రెడ్డి మీద ఆరోపణలు చేశారు.
గులాబీ పార్టీలో చేరుతానని చెప్పారు.తాజాగా పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీద తీవ్రంగా విరుచుకు పడ్డారు.
ఆయనను తొలగించాలని కూడా డిమాండ్ చేశారు.కిషన్ రెడ్డి కారణంగానే తెలంగాణాలో పార్టీ ఎదగడంలేదని ఆరోపించారు.
పార్టీ అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని అన్నారు.కిషన్ రెడ్డి గురించి ప్రధాని నరేంద్ర మోడీకి, హోం మంత్రి రాజనాధ్ సింగుకు లేఖలు రాశానని రాజా సింగ్ చెప్పారు.
కిషన్ రెడ్డి పట్ల టీడీపీ నాయకులు కూడా అసంతృప్తిగా వున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇంతమంది ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చు .