ఖమ్మంలో నేడు జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో ‘బాలమేధావి’ లక్ష్మీ శ్రీజ సభా వేదికపై నుంచి పలు విషయాలను అనర్గళంగా ప్రసగించింది.చిన్న వయస్సులోనే అంత జ్ఞాపక శక్తి ఉన్న చిన్నారిని చూసి పలువురు ఆశ్చర్యపోయారు.
కేసీఆర్ మరియు టీఆర్ఎస్ ప్రస్థానం… ఇలా పలు కీలక అంశాల గురించి మాట్లాడుతూ., “2000 సంవత్సరంలో ఎన్డీఏ కొత్త రాష్ట్రాలను ఏర్పరిచే క్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రయత్నించగా చంద్రబాబు అడ్డుపడ్డారు.
టీడీపీ నుంచి బయటకు రావడానికి మేధావులను, విద్యార్థులను, ఎన్జీవో సంఘ నేతలతో కేసీఆర్ చర్చలు ప్రారంభించారు.
ఇంటెలిజెన్స్ సమాచారంతో స్పందించిన చంద్రబాబు, కేసీఆర్ కు కోరుకున్న మంత్రి పదవి ఇస్తానని ‘రాయబారం’ పంపారు.
దీనిని సున్నితంగా తిరస్కరించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నా ధ్యేయమని ప్రకటించారు’ అని శ్రీజ పేర్కొనడంతో సీఎం కేసీఆర్ పగలబడి నవ్వారు.వేదికపై ఉన్న వారందరికీ నమస్కారాలతో మొదలైన లక్ష్మీ శ్రీజ ఉపన్యాసం గుక్కతిప్పుకోకుండా ముగిసింది.
టీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి గల కారణాలు, గతంలో కేసీఆర్ నిర్వహించిన పదవులు, గతంలో చంద్రబాబు రూపొందించిన విజన్ 2020లో తెలంగాణ గురించి లేకపోవడంపై కేసీఆర్ చేసిన బహిరంగ విమర్శలు, చంద్రబాబు కరెంటు చార్జీలు పెంచినప్పుడు కేసీఆర్ చేసిన విమర్శలు, వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం, కొన్ని రోజుల తర్వాత ప్రమాదంలో చనిపోవడం, సీఎంగా రోశయ్య ప్రమాణ స్వీకారం, ఫ్రీ జోన్ ఉద్యమం ప్రత్యేక ఉద్యమంగా మారడం, కేసీఆర్ క్యాబినెట్… ఇలా పలు అంశాల గురించి క్లుప్తంగా ఎటువంటి తప్పులు లేకుండా, స్పష్టంగా వేదికపై నుంచి శ్రీజ మాట్లాడింది.
దీంతో కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలందరూ చప్పట్లు కొట్టి మరీ చిన్నారిని అభినందించారు.
సహజంగా కేసీఆర్ పాల్గొనే సమావేశాల్లో ఆయన ప్రసంగమే హైలైట్ అవుతుంటుంది… కానీ, ఈ సారి మాత్రం ఈ చిన్నారి కేసీఆర్ ను పడగొట్టింది.