కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు… రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద యుద్ధాన్నే సృష్టించాయి.ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్టులకు అనుమతులు వచ్చాయని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం… ప్రాజెక్టులను కట్టి తీరతామని చెబుతోంది.
అయితే ఈ ప్రాజెక్టులు కడితే రాయలసీమ ఎడారిగా మారిపోతుందని ఏపీ సర్కారు వాదిస్తోంది.
ఈ క్రమంలో నిన్న ఏపీ డిప్యూటీ సీఎం, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్నూలు జిల్లా మినీ మహానాడులో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన కేఈ… తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేరని వ్యాఖ్యానించారు.తెలంగాణ సర్కారు నిర్మించతలపెట్టిన అక్రమ ప్రాజెక్టులను ఎలా ఆపాలో తమకు తెలుసంటూ ఆయన కలకలం రేపారు.
కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి గుండ్రేవుల ప్రాజెక్టును కడతామని చెప్పిన కేఈ… ముచ్చుమర్రి ఎత్తిపోతలతో రాయలసీమలోని 1.5 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని ప్రకటించారు.రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) ఎత్తు పెంచితే తమకు మాత్రమే కాకుండా తెలంగాణకు కూడా నష్టమేనని కేఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.