కొంతకాలం కిందట తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం బాగాలేదని మీడియాలో వార్తలు రాగానే అన్నాడీఎంకే నాయకులు, మంత్రులు కోపగించుకున్నారు.మీడియా వార్తలపై మండిపడ్డారు.
ఆమె నిక్షేపంగా ఉందంటూ ఆరోగ్యం బాగాలేదని అన్నవారి నాలుకలు కోస్తామని, ఒళ్లు చీరుస్తామని రెచ్చిపోయారు.కాని ఇప్పుడు జయలలితే తన ఆరోగ్యం బాగాలేదని చెప్పారు.
తన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో రేపు (గురువారం) రామేశ్వరంలో జరిగే మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నట్లు చెప్పారు.కలాం అంటే తనకు ఎంతో అభిమానమని, ఆయన అంత్యక్రియలకు హాజరై నివాళులు అర్పించాలని అనుకున్నానని, కాని ఆరోగ్యం బాగాలేకపోవడంతో ప్రయాణం చేయలేని స్థితిలో ఉన్నానని అన్నారు.
రామేశ్వరం చెన్నయ్కి ఆరొందల కిలోమీటర్ల దూరంలో ఉంది.అంత్యక్రియలకు మంత్రులు పన్నీర్ సెల్వం, నాథమ్ ఆర్ విశ్వనాథన్, వైద్యలింగంతో పాటు మరి కొందరు మంత్రులు వెళతారు.
అంత్యక్రియల రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది.సామాన్యుడికైనా, ముఖ్యమంత్రికైనా ఆరోగ్యం బాగాలేకవపోడం సహజం.
వయసు పెరుగుతున్నకొద్దీ ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి.ప్రముఖులకు సంబంధించిన ఈ విషయమైనా వార్తే కాబట్టి జయ ఆరోగ్యం బాగాలేదని మీడియాలో వార్తలు వచ్చాయి.
అదేదో మహాపరాధం అన్నట్లుగా అన్నాడీఎంకే నాయకులు ఆగ్రహించారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదని కూడా మీడియాలో వార్తలు వచ్చాయి.
వైద్యం కోసం అమెరికా వెళతారని కూడా అంటున్నారు.అయితే అన్నాడీఎంకే నాయకులకు జయలలిత ‘దేవత’ కాబట్టి ఆమెకు అనారోగ్యం కలగదని విశ్వాసం.