సినిమా ఇండస్ట్రీకి తెలుగు రాజకీయాలకు చాలా అవినాభావ సంబంధం ఉంది.సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులుగా ఉన్న హీరోలు రాజకీయాల్లోకి వచ్చి రాణించారు.
ఎన్టీఆర్, కృష్ణ, జగ్గయ్య, చిరంజీవి, బాలయ్య, జమున, శారద, కైకాల సత్యనారాయణ, బాబూ మోహన్, కోట శ్రీనివాసరావు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలానే ఉంటుంది.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్న పవన్కళ్యాణ్ సైతం జనసేన పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశాడు.
గత ఎన్నికలకు ముందే పవన్ జనసేన పార్టీ పెట్టినా ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి టీడీపీ+బీజేపీ కూటమికి సపోర్ట్ చేశాడు.ఇక వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీకి రెడీ అవుతోన్న సంగతి ఇప్పటికే ప్రకటించేశాడు.
పవన్ పార్టీలోకి వచ్చేందుకు ఇతర పార్టీలకు చెందిన పలువురు సీనియర్లతో పాటు కొందరు మంత్రులు సైతం రెడీగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే జనసేన నుంచి కీలకమైన గుంటూరు లోక్సభ నియోజకవర్గం తరపున ఓ ప్రముఖ సినీహీరో పోటీ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి.
ఆ హీరో ఎవరో కాదు శివాజీ.గతంలో బీజేపీలో పనిచేసిన శివాజీ ఆ పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో ఆ పార్టీతో విబేధించి ప్రత్యేక హోదా సాధనసమితి తరపున ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు.
ఈ క్రమంలోనే ఆయన బీజేపీ, టీడీపీ తీరును దారుణంగా ఎండగడుతున్నారు.
ఇక ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే పవన్కళ్యాణ్ రోడ్లమీదకు వచ్చి ఫైట్ చేస్తే వస్తుందని చెప్పడంతో పాటు పవన్ను పదే పదే ఆకాశానికి ఎత్తేస్తున్నాడు.
పవన్ హోదా కోసం బయటకు రావాల్సిన టైం ఆసన్నమైందని కూడా శివాజీ చెపుతున్నాడు.శివాజీ మీడియాతో మాట్లాడితే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాడు.
ఈ ఇండికేషన్లు అన్ని శివాజీ జనసేనకు దగ్గరవుతున్నాడన్న గుసగుసలకు కారణమవుతున్నాయి.
ఇక జనసేనలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న శివాజీ ఆ పార్టీ తరపున గుంటూరు లోక్సభ సీటుకు పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
శివాజీ గత ఎన్నికల్లోనే బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వార్తలు వచ్చినా అవి నెరవేరలేదు.ఇక ఇప్పుడు జనసేన తరపున ఆయన పేరు గుంటూరు ఎంపీ సీటుకు వినిపిస్తోంది.
మరి ఈ విషయంలో శివాజీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో ? చూడాలి.