ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉండాలి.అది లేనంత కాలం ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని ఇళ్ళు తిరిగినా ప్రయోజనం ఉండదు.
ఈ కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది.ఏ సమాచారం అయినా నిమిషాల్లో ఇంకా చెప్పాలంటే క్షణాల్లో ఒకరి నుంచి మరొకరికి చేరుతోంది.
విస్తారంగా అధికార యంత్రాంగం, టెక్నాలజీ ఉండే ప్రభుత్వానికి ప్రజా సమస్యలు తెలుసుకోవడం కష్టం కాదు.కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం చాలా కృషి చేస్తున్నామని చెప్పుకోవడానికి పాలకులు ఏవో కార్యక్రమాలు చేస్తుంటారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి ఒక కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభించింది .దాని పేరు జన చైతన్య యాత్ర.దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా 14వ తేదీ వరకు నిర్వహిస్తారు.అధికారులు, ప్రజాప్రతినిధులు, జన్మభూమి కమిటీ సభ్యులు గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి సమస్యలు తెలుసుకుంటారు.వినతి పత్రాలు తీసుకుంటారు.ఇవన్నీ పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తారు.
సమస్యల పరిష్కారానికి ఇంత తతంగం అవసరమా ? వార్తా పత్రికలూ చూసినా సమస్యలు తెలుస్తాయి.గ్రామాల నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఉన్న అధికారులకు తెలియవా ? తెలుస్తాయి.కాని ప్రజలను ఆకట్టుకోవడానికి ఇదొక మార్గం.జిల్లాల్లో ప్రజల ఫిర్యాదులు తీసుకోవడానికి ఒక ప్రత్యేక విభాగం కూడా ఉంది.ఇది జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉంటుంది.ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు తిరగడం ఎందుకు ? పాలకులు అసలు పనుల కంటే ఇలాంటి కొసరు పనులే చేస్తుంటారు.