ఏపీలో విపక్ష వైసీపీ అధినేత 2019 ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎన్నెన్నో వ్యూహాలు పన్నుతున్నాడు.ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ వ్యూహాల అమలులో నిమగ్నమైన జగన్ అవసరమైతే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోన్న కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టేందుకు కూడా వెనుకాడడం లేదట.
ప్రశాంత్ కిషోర్ ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఫస్ట్ విడతలో చేసిన సర్వేలో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గాల ఇన్చార్జ్లు ప్రజల్లోకి వెళ్లకుండా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్టు వెల్లడైంది.
ఈ సర్వేలో వైసీపీ ఫైర్బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కె.
రోజా పేరు కూడా ఉన్నట్టు తేలిందట.ఈ క్రమంలోనే రోజా దూకుడు వ్యవహారాలు, స్టేట్ వైడ్గా మీడియాలో హైలెట్ అవ్వాలన్న ఉద్దేశంతో ఆమె టీడీపీ, చంద్రబాబును ఘాటైన రీతిలో విమర్శలు చేయడం పార్టీకి ప్లస్ కంటే మైనస్సే ఎక్కువ అవుతోందని కూడా పీకే జగన్కు ఇచ్చిన నివేదికలో పొందుపరిచారట.
ఈ నివేదిక తర్వాత జగన్ రోజాను పిలిచి గట్టిగా క్లాస్ పీకినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.నువ్వు మారతావా ? లేదా నగరి నుంచి నిన్నే మార్చేయమంటావా ? అని కూడా ఫైర్ అవ్వడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె విశాఖలో మహాధర్నాకు కూడా రాలేదన్న చర్చలు వైసీపీలోనే వినిపించాయి.
ఇక నగరిలో టీడీపీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడిని ఈ సారి ఢీకొట్టడం రోజాకు కష్టమే అని కూడా పీకే సర్వేలో తేలిందట.దీంతో జగన్ వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి రోజాను తప్పించాలని భావిస్తున్నారట.
ఇక్కడ నుంచి పార్టీలో సీనియర్ నేత లేదా ఓ పారిశ్రామిక వేత్తను రంగంలోకి దింపే ప్రయత్నాలు జరుగుతోన్నట్టు తెలుస్తోంది.