నిజమే! తమిళనాడు సీఎం జయలలిత మరణంతో ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా నష్టపోయారు! నిజానికి ఇప్పుడు దేశ వ్యాప్తంగా జాతీయ పార్టీలకన్నా ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ ప్రాధాన్యం పెరిగింది.దీంతో ఎంత పెద్ద జాతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీల అండదండలు లేకుండా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ క్రమంలోనే దక్షిణాదిన బలంగా ఉన్న టీడీపీ, అన్నాడీఎంకేలు కూడా కేంద్రంలో పలుమార్లు చక్రం తిప్పారు.ఇక, టీడీపీ విషయానికి వస్తే.
ఇప్పుడు కూడా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉంది.
ఇలాంటి క్రమంలో ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాల అభివృద్ధికే పెద్ద పీట వేస్తుంటాయి.
ఆ ఒప్పందం మేరకే ప్రాంతీయ పార్టీలతో జట్టుకడతాయి.అది నెరవేరని పక్షంలో మద్దతును ఉపసంహరించుకుంటాయి.
ఇక, ప్రస్తుతం జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం విషయంలో ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి పెద్ద కూటమిగా ఏర్పడి.థర్డ్ ఫ్రంట్కు రూపకల్పన చేశాయి.
దీనికి ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు గతంలో ప్రముఖపాత్ర కూడా వహించారు.బిహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా సీఎంలను కూడగట్టి జాతీయ స్థాయిలో అధికారం చేపట్టేస్థాయికి ఎదగాలని భావించారు.
ఈ ప్రతిపాదనకు తమిళనాడు దివంగత సీఎం జయలలిత కూడా ఎంతగానో కలిసివచ్చారు.నిజానికి ప్రధాని కావాలన్న తన మనసులోని కోరికను అలాగైనా తీర్చుకోవాలని ఆమె చాలా సార్లు యత్నించారు.
దీంతో టీడీపీ, అన్నాడీఎంకేలు థర్ఢ్ ఫ్రంట్ ఏర్పాటుకు ఎప్పుడూ ముందుండేవి.కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
అమ్మ మరణంతో అన్నా డీఎంకే అనాథ డీఎంకే అయిపోయింది.ఇప్పుడున్న పరిస్థితిలో అసలు ఆ పార్టీ బతికి బట్టకడుతుందా? అన్నది ప్రశ్నగా మారింది.దీంతో చంద్రబాబు వ్యూహం అయిన థర్డ్ ఫ్రంట్కు కలిసి వచ్చే అతి పెద్ద పార్టీ అన్నాడీఎంకే లేకపోవడంతో చంద్రబాబుకు పెను దెబ్బే అనే విశ్లేషణ జరుగుతోంది.జయ మరణంతో పొలిటికల్గా బాబు వీక్ అయ్యారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.