టీడీపీ-బీజేపీ కూటమితో తెగదెంపులు చేసుకునే దిశగా జనసేనాని పవన్ స్పష్టమైన అడుగులు వేస్తున్నాడు.ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్న ఆయన.
దానిని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నవారిపై నిప్పులు చెరిగాడు.రాష్ట్రానికి హోదా ఇస్తానని.
చివరకు మాట తప్పిన నేతలపై ధ్వజమెత్తాడు.హోదాకి బదులు ప్యాకేజీ ప్రకటించినపుడు రెండు పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టారని తీవ్రంగా విమర్శించిన పవన్.
ఇప్పుడు అదే స్థాయిలో విరుచుకుపడ్డాడు, మాట ఇచ్చిన వాళ్ళు మాటతప్పారని అందుకే ప్రభుత్వాలని నిలదీస్తున్నానన్నారు.
తనకు రాజకీయ నాయకుల్లో అవకాశవాద రాజకీయాలే కనిపిస్తున్నాయని నిప్పులు చెరిగారు.
`పదవిలోకి రాకముందు ఆకాశాన్ని తెస్తాం, చంద్రుడిని భూమ్మీదకు తెస్తాం అని ఆశలు కల్పించి, పదవుల్లోకి, అధికారంలోకి వచ్చాక వాటిని మరచిపోయి, కుంటిసాకులు చెప్పడం నచ్చలేదని అన్నారు.టీడీపీ, బీజేపీ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు తన అనుభవం గురించి ఎవరూ ప్రశ్నించలేదని, ఈ రోజు తాను ప్రభుత్వాలను ప్రశ్నిస్తుంటే తన రాజకీయ అనుభవం గురించి కొందరు మాట్టాడుతున్నారని పవన్ మండి పడ్డారు.
కొన్ని దశాబ్దాలుగా మూలుగుతున్న సమస్యలను పరిష్కరించకుండా, గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకువచ్చి సమస్య తీవ్ర స్థాయికి చేరుకునే వరకూ తీసుకురావడంపై ఆవేశం, ఆవేదనతోనే జనసేన పార్టీని పెట్టినట్టు పవన్ కల్యాణ్ చెప్పారు.అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సమస్యలను నిర్లక్ష్యం చేసిందని, అందుకే కొత్త, అనుభవ నాయకత్వం అవసరమని ఆలోచించి.
టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతుఇచ్చానని తెలిపారు.
సమస్యలను అర్థం చేసుకుని, అనుభవాల నుంచి మోడీ, చంద్రబాబు పాఠాలు నేర్చుకుంటారనే సదుద్దేశంతోనే వారి జెండా మోశానని స్పష్టంచేశారు.
`నాతో పాటు నన్ను నమ్మినవారందరూ, నన్ను ఫాలో అయిన వారందరూ మోశారు.కానీ వాళ్లు ఏదైతే మాటిచ్చారో, దాన్ని తప్పారు` అని పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు.
పవన్ ఇక టీడీపీ-బీజేపీకి గుడ్ బై చెప్పడం ఖాయమనేది విశ్లేషకుల అభిప్రాయం.