కోర్టు కేసులకు సంబంధించి ఓ సామెత ఉంది.‘ఓడినవాడు కోర్టులో ఏడిస్తే…గెలిచినవాడు ఇంట్లో ఏడ్చాడట’.ఓడినవాడు ఏడవడం సహజం.మరి గెలిచినవాడు ఎందుకు ఏడుస్తాడు? కేసు ఏళ్ల తరబడి సాగడం.పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు కావడం ఇందుకు కారణాలు.కొన్ని కేసుల్లో వేలు, లక్షలు కూడా ఖర్చవుతాయి.
కొన్ని కేసుల విచారణ ఏళ్ల తరబడి కొనసాగడంతో సాక్షల్లో కొందరు చనిపోతారు.కేసులు వేసినవారు కూడా పోయే అవకాశం ఉంది.
వివాదాలు వచ్చినప్పుడు కోర్టు బయటే తేల్చేకొని, ఏదో ఒకవిధంగా సర్దుబాటు చేసుకోవడమే మంచిదంటారు.ఈ సర్దుబాటు చిన్న కేసుల విషయంలోనే సుమా…! చిన్నవారు అంటే ఆర్థిక స్తోమత లేనివారు కోర్టులకెళితే మరింత చితికిపోతారు.
మన దేశంలో ‘న్యాయం’ పొందడం చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది.సెషన్స్ కోర్టు మొదలుకొని సుప్రీం కోర్టు వరకు కేసులు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి.
ప్రధాన కారణం…కేసుల విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతుండటమే.కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తెలియచేసిన ప్రకారం…సుప్రీం కోర్టు సహా అన్ని కోర్టుల్లో కలిపి గత ఏడాది రెండు కోట్ల కేసులు పరిష్కారం కాగా, ఇంకా మూడు కోట్ల కేసులు పెండింగులో ఉన్నాయి.
గత ఏడాది సుప్రీం కోర్టు సుమారు తొంబైమూడు వేల కేసులు పరిష్కరించగా, ఇరవై నాలుగు హైకోర్టులు సుమారు పద్దెనిమిది లక్షల కేసులు పరిష్కరించాయి.కింది కోర్టులు కోటీ తొంభై లక్షలకు పైగా కేసులు పరిష్కరించాయి.
కేసులు ఏళ్ల తరబడి సాగడమే కాకుండా, న్యాయ వ్యవస్థలో భర్తీ కాని ఖాళీలు కూడా బోలెడు ఉన్నాయి.ఏదైనా వివాదంలో ఒక్కసారి కోర్టుకు వెళితే ఇంతే సంగతులు.
కోర్టు కేసులు కొనసాగించడానికి ఆస్తులు కూడా అమ్ముకున్న కుటుంబాలు ఉన్నాయి.ఆలస్యంగా జరిగే న్యాయం న్యాయమే కాదంటారు.
కాని కోర్టుల్లో ఆలస్యాన్ని నివారించడం సాధ్యం కాదు.