న్యాయాధికారుల నియామకాల వ్యవహారంలో తెలంగాణ న్యాయవాదులు ప్రారంభించిన ఉద్యమానికి న్యాయాధికారుల మద్దతు ఇవ్వడంతో ఇప్పటికే కొందరిపై క్రమశిక్షణా చర్యలకు దిగిన హైకోర్టు వరంగల్లో ఆంధ్రప్రాంతానికి చెందిన న్యాయమూర్తిపై దాడి విషయాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది .న్యాయమూర్తుల భద్రతకు ఇద్దరేసి గనమెన్లను కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది.
కాగా ఉద్యమానికి బాసటగా నిలుస్తూ, ఈ నెల వరకు తాము సెలవు పెడుతున్నామంటూ ప్రకటించిన న్యాయాధికారుల ఆశలపైనా నీళ్లు జల్లేలా ఉత్తర్వులు జారీ చేసింది.న్యాయాధికారులకు సెలవు మంజూరులో జిల్లా చీఫ్, సెషన్స్ జడ్జీల అధికారాలకు హైకోర్టు కత్తెర వేస్తూ బుధవారం జారీ చేసిన ఉత్తర్వులు న్యాయాధికారులను అయోమయంలో పడేసిందనటంలో సందేహమే లేదు.
న్యాయాధికారులు ఎవరు సెలవు తీసుకోవాలన్నా ముందస్తుగా ఆయా జిల్లాల వ్యవహారాలు చూస్తున్న హైకోర్టు జడ్జీలకు విన్నవించాలని, సదరు సెలవు విషయమై హైకోర్టు జడ్జీలు తగిన అనుమతి ఇచ్చిన తదుపరే సీనియర్/జూనియర్ సివిల్ జడ్జీలకు సెలవులు మంజూరు చేయాలని విస్పష్టాదేశాలిచ్చింది.దీంతో ఇప్పటికే 15 రోజుల పాటు సెలవు ప్రకటించిన తెలంగాణ న్యాయాధికారులు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేయటం పట్ల కూడా కొందరు తప్పుపడుతున్నారు.
కోర్టు అనుమతి తీసుకున్న తర్వాతే సెలవులోకి వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా న్యాయాధికారులు పట్టనట్టు వ్యవహరించడంపై గురువారం హైకోర్టు ఆగ్రహించింది.ధిక్కార స్వరం పెంచేందుకు ఊత మిస్తున్న ఉద్యోగులపైనా కొరడా ఠులిపించి నలుగురుని సస్పెండ్ చేసింది.
కాగా వరంగల్లో పనిచేస్తున్న ఆం్రధ్రప్రాంత న్యాయమూర్తిపై న్యాయవాదులే దాడి చేయటం పట్ల పలు ప్రాంతాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటంతో ఉద్యమం పక్కదారి పడుతోందన్న వాదనలూ వినవస్తున్నాయి.
విభజనకు ముందు ఆంధ్రప్రాంతం వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామన్న కేసీఆర్ ప్రజలను రెచ్చగొట్టేలా చేస్తున్న ప్రకటనల కారణంగానే ప్రస్తుతం న్యాయమూర్తులపైనా దాడులు జరిగే పరిస్థితి నెలకొందని ఏపీ లాయర్ల జేఏసీ మండిపడింది.