తెలంగాణకు వరం ఆంధ్రాకు శాపంగా పరిణమించిందని అర్థం కాదు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఓ వరం ప్రసాదించింది.
ఆంధ్రాకు మాత్రం శాపం కొనసాగుతూనే ఉంది.సాధారణ భాషలో చెప్పాలంటే కేంద్రం తెలంగాణ డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించగా, ఆంధ్రా డిమాండ్ పట్ల ఏ స్పందనా లేకుండా మౌనంగా ఉంది.
అసలు సంగతి ఏమిటంటే….తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని రాష్ర్టం విడిపోయినప్పటి నుంచీ తెలంగాణ నాయకులు కోరుతూనే ఉన్నారు.
పార్లమెంటులోనూ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు.నిరసనలు కూడా తెలియచేస్తున్నారు.
దీంతో ‘మీకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తాం’ అని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.ఆంధ్రా వారి అసలు సమస్య ‘ప్రత్యేక హోదా’ అని తెలిసిందే కదా.వీరు డిమాండ్ చేస్తున్నారు.ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నారు.
కాని కేంద్రం ప్రత్యేక హోదా విషయంలో కమిట్ కాలేదు.ఇది బుధవారం లోక్సభలో జరిగిన వ్యవహారం.
తమ డిమాండ్ల కోసం రెండు తెలుగు రాష్ర్టాల ఎంపీలు ఆందోళన చేయగానే కేంద్రం స్పందన ఇది.ఇరవైఐదు మంది కాంగ్రెసు ఎంపీలను సస్పెండ్ చేసినందుకు నిరసనగా కాంగ్రెసుతోపాటు ఇతర ప్రతిపక్షాలు సమావేశాన్ని బాయ్కాట్ చేశాయి.ఆ సమయంలో తెలంగాణ ఎంపీలు హైకోర్టు కోసం, వైకాపా ఎంపీలు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేశారు.వైకాపా, టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలతో సభను హోరెత్తించారు.ప్లకార్డులు ప్రదర్శించారు.టీఆర్ఎస్ ఎంపీలు తమ డిమాండ్ను చొక్కల మీద కూడా ప్రింట్ చేయించుకున్నారు.
ఆ సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు జోక్యం చేసుకొని హైకోర్టు విభజన అంశం న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ పరిశీలనలో ఉందని చెప్పారు.ఆ సమయంలో సదానంద సభలో లేరు.
రాష్ర్ట విభజన కారణంగా ఏర్పడిన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.ఇక ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య కమిట్ అవలేదు.