టాలీవుడ్ కింగ్ నాగార్జున మరియు రాఘవేంద్ర రావుల కాంబినేషన్లో త్వరలో మరో ఆద్యాత్మిక చిత్రం రాబోతుందని గత కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే.అయితే ఆ సినిమా ఏసు ప్రభు జీవిత కథ ఆధారంగా ఉండబోతుందని, ఆ సినిమాలో నాగార్జున ఏసు ప్రభువుగా కనిపించబోతున్నాడని ప్రచారం జరిగింది.
అయితే అనూహ్యంగా మరో వార్త ఫిల్మ్ సర్కిల్స్లో జోరుగా వినిపిస్తోంది.రాఘవేంద్ర రావు కాంబినేషన్లో వచ్చిన ‘అన్నమయ్య’ చిత్రంలో నాగార్జున వెంకటేశ్వర స్వామికి భక్తుడిగా కనిపించాడు.
అయితే త్వరలో వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రంలో నాగార్జున వెంకటేశ్వర స్వామీగా కనిపించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి జీవిత కథను ఆధారంగా చేసుకుని ప్రస్తుతం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఒక స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఆ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కావచ్చింది.వచ్చే నెలలో ఆ స్క్రిప్ట్ వర్క్ను పూర్తి చేసి, ఆ వెంటనే నటీనటుల ఎంపిక చేసి, సినిమాను ఏప్రిల్లో షూటింగ్ ప్రారంభించాలని రాఘవేంద్ర రావు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయనో’ సినిమా కూడా అప్పటి వరకు పూర్తి కానుంది.ఇప్పటి వరకు ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిర్డి సాయి’గా ప్రేక్షకులను అలరించిన నాగార్జున త్వరలో ఏడు కొండల వాడిగా మెప్పించబోతున్నాడనే వార్త తెలిసిన ఆయన అభిమానులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.