సహాయం చేసే వ్యక్తి ప్రస్తుత భాజపా ఎంపీ, మాజీ హీరోయిన్ హేమమాలిని.దాన్ని అందుకోవల్సిన వారు కారు ప్రమాదంలో గాయనడినవారు.
ఈమధ్య రాజస్థాన్లోని దౌసా జిల్లాలో హేమమాలిని ప్రయాణిస్తున్న కారు, మరో వాహనాన్ని ఢీకొనడం, హేమకు తీవ్ర గాయాలు కావడం, అవతలి కారులో ఐదేళ్ల పాప చనిపోవడం, మిగతావారు తీవ్రంగా గాయపడటం…ఇదంతా తెలిసిందే.హేమమాలిని ప్రస్తుతం చాలావరకు కోలుకున్నారు.
ఇంటికి తిరిగొచ్చారు.ఈ సందర్భంగా హేమ కూతురు ఇషా డియోల్ మీడియాతో మాట్లాడుతూ తల్లి రికవర్ అయినందుకు చాలా సంతోషపడింది.
చిన్నపాటి సర్జరీ జరిగిందని, ఇతరత్రా బాగానే ఉందని చెప్పింది.ప్రమాదం జరిగినప్పుడు అవతలి కారులోని చిన్న పాప చనిపోవడం చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని పేర్కొంది.ఆ కారులో గాయపడిన వారికి తన తల్లి తప్పకుండా సహాయం చేస్తుందని చెప్పింది.
ఆమె నాయకురాలే కాకుండా, మానవత్వం ఉన్న మంచి మనిషని చెప్పింది.ఈ సందర్భంగా ఈషా డియోల్ మీడియా ద్వారా జనానికి ఓ సలహా కూడా ఇచ్చింది.
కారులో వెనక సీటులో ఉన్నవారు కూడా సీటు బెల్టు పెట్టుకోవాలని, అది పెట్టుకోకపోవడం వల్లనే తన తల్లి గాయపడిందని చెప్పింది.మరి కూతురు ఈషా చెప్పినట్లుగా గాయపడిన కుటుంబానికి హేమమాలిని భారీగా సాయం చేయాల్సిన అవసరం ఉంది.
అందులోనూ వారు పాపను కూడా కోల్పోయారు.ఏదో నామమాత్రపు సాయం అందిస్తే ‘పేరు గొప్ప…ఊరు దిబ్బ’ అన్న చందంగా ఉంటుంది.