ఏపీలో ప్రధాన ప్రతిపక్ష అధినేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత జిల్లా ఆ పార్టీకి పెద్ద ఖిల్లా.గత రెండు దశాబ్దాలుగా ఇక్కడ టీడీపీ కాంగ్రెస్, వైసీపీలకు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతోంది.
గత మూడు ఎన్నికల్లోను టీడీపీకి ఇక్కడ షాకింగ్ ఫలితాలే వస్తున్నాయి.జిల్లాలోని ఒకటో రెండు ఎమ్మెల్యే సీట్లు టీడీపీ గెలుస్తున్నా కడప, రాజంపేట ఎంపీ సీట్లు మాత్రం టీడీపీ గెలవలేకపోతోంది.
ఇక ఇప్పుడిప్పుడే ఇక్కడ టీడీపీ కాస్తో కూస్తో పుంజుకుంటోంది అనుకుంటున్న టైంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోను గ్రూపుల గోల వైసీపీకి ప్లస్గా మారింది.
ఇక్కడ టీడీపీకి ఇప్పుడిప్పుడే బలం పెరుగుతున్న టైంలో నాయకుల మధ్య అనైక్యత మరోసారి వైసీపీకి వరంగా మారింది.
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోను ఇదే పరిస్థితి.జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఆదికి అస్సలు పొసగడం లేదు.
ఆదికి వచ్చే ఎన్నికల్లోను టీడీపీ టిక్కెట్ ఖరారైనట్టే.దీంతో వచ్చే ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్లిపోతారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
రిజర్వ్డ్ నియోజకవర్గమైన బద్వేల్లో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయజ్యోతి, వైసీపీ నుంచి వచ్చిన జయరాములు ఇద్దరూ టికెట్ ఆశిస్తున్నారు.ఎస్సీ రిజర్వుడ్ కావడంతో మాజీ మంత్రి వీరారెడ్డి కూతురు విజయమ్మకు అవకాశంలేదు.
ఇక్కడ ఈ ముగ్గురు నేతలు ఒకేవరలో ఇమడని కత్తుల చందంగా ఉన్నారు.జిల్లా కేంద్రమైన కడపలో అయితే ఏకంగా ఆరుగురు నేతలు టిక్కెట్ ఆశిస్తున్నారు.
రాయచోటిలో మాజీ ఎమ్మెల్యేలు రమేష్రెడ్డి, పాలకొండ్రాయుడు, రైల్వేకోడూరులో ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన చెంగల్రాయుడు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ విశ్వనాథనాయుడు గ్రూపులు, జగన్ స్థానమైన పులివెందులలో సతీష్రెడ్డి వర్సెస్ రాంగోపాల్రెడ్డి, ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, లింగారెడ్డి గ్రూపులు, కమలాపురంలో వీరశివారెడ్డి, పుత్తనరసింహారెడ్డి ఇలా అన్ని నియోజకవర్గాల్లోను రెండుకు మించిన గ్రూపులు ఉన్నాయి.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు వీరిలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా మరొకరు మాత్రం ఆయన్ను దెబ్బతీయడమో లేదా వైసీపీకి సహకరించడమో, వైసీపీ తరపున పోటీ చేయడమో ఖాయం.
దీంతో ఇక్కడ టీడీపీని సొంత పార్టీ నాయకులే దెబ్బతీసుకుంటూ వైసీపీ గెలుపునకు ముందే బాటలు వేస్తున్నట్లవుతోంది.