గబ్బర్ సింగ్ ఇక్కడ అంటే ఫ్యాన్స్ ఈలలు వేశారు.గద్దర్ ఇక్కడ అంటే జనాలు చప్పట్లు కొట్టారు.
ఇప్పుడనే కాదు ఎప్పుడు కూడా పవన్ కి ప్రజా సాహిత్యం అన్నా పోరాటాలు అన్నా ప్రజా గాయకులు అన్నా ఎంతో ఇష్టం.ఆ ఇష్టంతోనే మాష్టార్జీలాంటి వారికి ఓ లైఫ్ ఇచ్చాడు.
జానీ సినిమా టైటిల్ సాంగ్ తో పాటు అన్నవరంలోనూ ఓ పాట రాయించుకున్నాడు.ఒక్క గద్దరే కాదు వంగపండు, గోరెటి ఇలా ఎవ్వరన్నా ఆయనకు ఇష్టమే.
ఈ ఇష్టంతోనే తన కెమెరా మెన్ గంగతో రాంబాబు సినిమాని పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి అంకితం ఇచ్చాడు.తాజాగా గద్దర్ పవన్ తో పని చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఆయన తనకు చిరకాల మిత్రుడని.రాజకీయాల్లో కలిసి పనిచేసే అవకాశాన్ని ఆలోచిస్తానని స్పష్టం చేశారు.
పాట నుంచి పొలిటికల్ పార్టీ వరకు
త్వరలో కొత్త పార్టీ పెట్టనున్న గద్దర్ నుంచి ఈ తరహా ప్రకటన రావడంతో పొలిటికల్ సర్కిల్స్లో దీనిపై చర్చ షురూ కావడం ఖాయం.ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ.
ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పవన్ పార్టీ గురించి విస్తృత చర్చ జరుగుతోందని, రాజ్యాధికారం చిటికెలో వచ్చేది కాదని వ్యాఖ్యానించారు.తన 70ఏళ్ల త్యాగాన్నే తాను అర్హతగా భావిస్తానని, త్వరలోనే అన్ని శక్తులను ఏకం చేస్తానని అన్నారు.
మొత్తంగా ఇంతకాలం పాటగా పల్లవించిన గద్దర్ ఇవాళ ప్రజాక్షేత్రంలో నేరుగా బరిలోకి దిగేందుకు బుల్లెట్ కాదు బ్యాలెట్ ముఖ్యమని చెప్పేందుకు సన్నద్ధ మవుతున్నారు.తెలంగాణ ఏర్పాటైన మూడేళ్లకు గద్దర్ తన పంథా మార్చి వర్తమాన రాజకీయాల్లో క్రియాశీలకంగా ఎదిగేందుకు ఇస్తున్న ప్రకటనలు ఇవి.వీటిపై ఇప్పటికే విమర్శలు రేగుతున్నా ఆయన మాత్రం తానేంటో తెలియజెప్పేందుకు, తెలంగాణ వాకిట తన హవాని నిరూపించుకునేందుకు సిద్ధపడుతున్నారు.