‘దాడి’ అని మనం క్లుప్తంగా చెప్పుకునే నాయకుడు ఎవరో చాలా మందికి తెలిసేవుంటుంది.ఉత్తరాంధ్రలోని అనకాపల్లిలో చెప్పుకోదగిన నాయకుల్లో దాడి ఒకరు.
పూర్తి పేరు దాడి వీరభద్రరావు.రచయితగా కూడా అంతో ఇంతో పేరున్న ఈ నాయకుడు టీడీపీలో ప్రముఖ నేత.మాజీ మంత్రి కూడా.ఎన్టీఆర్ పార్టీ పెట్టగానే అందులో చేరి మూడు దశాబ్దాలు కొనసాగి, రాజకీయంగా ఎంతో ఎదిగి, పదవులు అనుభవించి గత సాధారణ ఎన్నికల సమయంలో వైఎస్సార్ పార్టీలో చేరిపోయారు.
కుమారుడూ ఆయన దార్లోనే నడిచారు.వైకాపాలో చేరి టీడీపీని, చంద్రబాబు నాయుడిని నానా దుర్భాషలాడిన దాడికి కొద్ది కాలంలోనే తత్వం బోధపడింది.జగన్ వైఖరి ఆయనకు నచ్చలేదు.తనను అవమానిస్తున్నాడని ఫీలయ్యారు.
దూరం పెరుగుతూ పోయింది.చివరకు ఓ ఫైన్ మార్నింగ్ వైకాపా నుంచి బయటకు వచ్చారు.
ఏ నాయకుడైనా సరే ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి పోవడానికి కారణం కోరిన ‘పదవి’ ఇవ్వకపోవడమే.ఎన్ని పదవులు చేసినా తృప్తి ఉండదు.
ఏదో కారణాలవల్ల పదవి ఇవ్వలేకపోతే వెంటనే కోపం వస్తుంది.దీంతో ఏదో సాకు చూపి జంప్ జిలానీ అవతారం ఎత్తుతారు.
దాడి వీరభద్రరావుది కూడా ఇదే కేసు.టీడీపీలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంతో కోపం వచ్చింది.
వైకాపా అధికారంలోకి వస్తుందని అంచనా వేసుకొని ఆ పార్టీలో చేరారు.కాని అనేకున్నది ఒకటి…అయ్యింది మరొకటి.
దానికి తోడు జగన్ ధోరణి నచ్చలేదు.దాంట్లోంచి బయటకు వచ్చాక చాలా కాలం గమ్మున ఉన్న దాడి ఇప్పుడు మీడియా ముందు నోరు విప్పి మనసులో మాట బయటపెట్టారు.
తనకు టీడీపీలో చేరాలనుందని చెప్పారు.కాని తానై తాను వెళ్లి బాబుతో మాట్లాడతానని అనలేదు.‘బాబు ఆహ్వానిస్తే టీడీపీలోకి వెళతా’ అన్నారు.కాని బాబు పిలుస్తారా? ఉద్యోగం కావల్సింది దాడికి.మరి ఆయన వెళ్లి అడగడం సమంజసం కదా….!
.